వి సినిమాలో స‌గం ఓటీటీకి ఇద్దామ‌నుకున్నార‌ట‌

Sudheer babu V Movie

లాక్ డౌన్ కార‌ణంగా 2 నెల‌లుగా థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌టం.. ఇంకో నాలుగైదు నెల‌లు అవి తెరుచుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. సినిమాల సంద‌డంతా అక్క‌డే ఉంది. జ‌నాలు మునుపెన్న‌డూ లేని విధంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో విర‌గ‌‌బ‌డి సినిమాలు చూస్తున్నారు.

వాటి ఆదాయం కూడా లాభ సాటిగా ఉండ‌టం.. కంటెంట్ కోసం డిమాండ్ కూడా పెరుగుతుండ‌టంతో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాల్ని నేరుగా త‌మ వేదిక‌ల‌పై రిలీజ్ చేసేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే నాని, సుధీర్ బాబుల క‌ల‌యిక‌లో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీ వి ఓటీటీలో డైరెక్టుగా రిలీజ‌వుతుంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. త‌మ సినిమా అలా రిలీజ్ కాద‌ని నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఓటీటీల‌తో చ‌ర్చ‌లైతే జ‌రిగిన‌ట్లు, జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. ఇప్పుడు ఇదే విష‌య‌మై ఓ ఇంట‌ర్వ్యూలో సుధీర్ బాబును అడిగితే.. ఓ ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు.

వి సినిమాను స‌గం వ‌ర‌కు ఓటీటీలో రిలీజ్ చేసి.. మిగ‌తా స‌గంపై ఉత్కంఠ రేకెత్తిద్దామ‌న్న ఆలోచ‌న ఒక ద‌శ‌లో వ‌చ్చింద‌న్నాడు. ఇలా చేసి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే త‌ర‌హాలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించి వి సెకండాఫ్ చూసేందుకు థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేయాల‌నుకున్న‌ట్లు తెలిపాడు.

కానీ ఆ ఆలోచ‌న త‌ర్వాత విర‌మించుకున్నామ‌న్నాడు. వి థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేసే సినిమా అని.. చిన్న తెర‌ల‌పై దాన్ని రిలీజ్ చేయ‌డం బాగుండ‌ద‌ని భావించామ‌ని, దీనిపై చిత్ర బృందంలో అంద‌రూ మాట్లాడుకుని వెన‌క్కి త‌గ్గామ‌ని చెప్పాడు.