స్వామివారి ‘ఏకాంత సేవ’ లో ఆ జంట.. కొత్త రచ్చ షురూ

తిరుమలకు సంబంధించి తరచూ విమర్శలు.. ఆరోపణలు ఎదుర్కొనే వైసీపీ సర్కారు.. తాజాగా మరో ఆరోపణ తెర మీదకు వచ్చింది. స్వామివారి ఏకాంత సేవకు.. నిబంధనలకు భిన్నంగా ఒక సంపన్న జంటను తీసుకెళ్లటం సంచలనంగా మారింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితులైన ఆ జంటను.. ప్రత్యేకంగా స్వామి వారి సేవకు తీసుకెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు భిన్నంగా అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

శ్రీవారికి జరిపే సేవల్లో అన్నింటి కంటే అత్యుత్తమైనదిగా.. బాగా డిమాండ్ ఉన్న సేవ.. స్వామివారికి చేసే అభిషేక సేవ. అన్ని సేవల్లోకి ఇది అత్యంత పవిత్రమైనదని చెబుతారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మూలవిరాట్ కు అభిషేక సేవ చేస్తారు. ఈ సేవకు ఉన్న డిమాండ్ కు ఉన్న నిదర్శనం.. ఆ సేవకు ఇచ్చే టికెట్ల బుకింగ్ రానున్న ఏళ్లకు కూడా అమ్మడైనట్లుగా చెబుతారు.

అలాంటి సేవను కరోనా నేపథ్యంలో ఏకాంత సేవగా మార్చారు. అంటే.. అర్చకులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అయితే.. ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక వారం ఈవో దంపతులు.. మరో వారం టీటీడీ ఛైర్మన్ దంపతులు పాల్గొనేందుకు వీలుంది. వారు తప్పించి.. మిగిలిన బోర్డు సభ్యులు మొదలుకొని ఎవరూ కూడా ఈ సేవకు హాజరు కావటానికి అవకాశం లేదు.
కానీ.. అందుకు భిన్నంగా టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.. తిరుపతికి వచ్చిన ప్రతిసారీ తనకు అతిధ్యం ఇచ్చే ఒక కుటుంబాన్ని తాజా సేవకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్లినట్లుగా చెబుతారు. అంతేకాదు.. వారితో పాటు ఒక బోర్డు సభ్యుడ్ని కూడా ఆయన తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి వెంట.. స్వామి వారి ఏకాంత సేవకు హాజరైన సంపన్న కుటుంబం తిరుపతిలోని ఒక భారీ భవంతిలో ఉంటారని చెబుతున్నారు.

వారికి విదేశాల్లోనూ భారీ వ్యాపార సంస్థలు ఉన్నాయని.. గతంలో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి కూడా తిరుపతి వస్తే.. వారింట్లోనే బస చేసేవారని చెబుతారు. చాలామంది రాజకీయ ప్రముఖులకు.. ఆయన హెలికాఫ్టర్లు.. స్పెషల్ విమానాల్ని ఆయన ఏర్పాటు చేస్తారని చెబుతారు. అలాంటి ఆయన కోరిన కోరికకు.. నిబంధనల్ని పక్కన పెట్టి.. ఏకాంత సేవకు తీసుకెళ్లినట్లుగా ఆరోపణలు బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది.