మొత్తానికి బన్నీ కూడా దిగిపోయాడే..

పాన్ ఇండియా.. గత కొన్నేళ్లుగా ఈ మాట సినీ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. మామూలు ప్రేక్షకులు కూడా చాలా సాధారణంగా ఈ మాట వాడేస్తుంటాడు. ‘బాహుబలి’ సినిమా ఇండియా మొత్తం భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించి తిరుగులేని విజయం సాధించడంతో ఈ మాట వాడకం పెరిగింది. ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించుకుని ప్రభాస్ ‘పాన్ ఇండియా స్టార్’ కావడంతో మిగతా వాళ్లలోనూ అలాంటి ఇమేజ్, మార్కెట్ మీద ఆశ పుట్టింది.

ఇంతకుముందు నామమాత్రంగా వేరే భాషల్లో సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు సీరియస్‌గా పాన్ సౌత్ ఇండియా, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గత ఏడాది ‘డియర్ కామ్రేడ్’ను పాన్ సౌత్ లెవెల్లోనే రిలీజ్ చేశాడు. కానీ ఆ సినిమా తేడా కొట్టేసింది. అయినా తగ్గకుండా ఇప్పుడు ‘ఫైటర్’తో ఏకంగా ‘పాన్ ఇండియా’ టార్గెట్‌తో వెళ్తున్నాడు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ని పాన్ ఇండియా లెవెల్లోకే తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఐతే ‘బాహుబలి’కి దీటుగా ఆ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అది తుస్సుమనిపించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మరోసారి ‘సాహో’తో పాన్ ఇండియా టార్గెట్ అందుకోవడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా ఆ సినిమా హిందీలో బాగా ఆడి.. దక్షిణాదిన తుస్సుమనిపించింది.

మహేష్ ‘స్పైడర్’తో తమిళంలోకి వెళ్దామని చూసి దెబ్బ తిన్నాడు. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో హిందీ వైపు ఓ రాయి వేసి చూశాడు. బోల్తా కొట్టాడు. వేరే భాషల హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు ట్రై చేశారు. కానీ ఒక్క ‘కేజీఎఫ్’ మాత్రమే సక్సెస్ అయింది. ‘బాహుబలి’ తర్వాత అన్ని భాషల్లో ఆదరణ పొందిన ఏకైక చిత్రమదే.

ఐతే చాలా మంది ఫెయిల్ అయిన ‘పాన్ ఇండియా’ టార్గెట్‌ను అందుకోవడానికి ఇప్పుడు అల్లు అర్జున్-సుకుమార్ జోడీ రెడీ అయింది. వీళ్ల కలయికలో రానున్న కొత్త సినిమా ‘పుష్ప’ను ట్రూ పాన్ ఇండియన్ మూవీగా చేయబోతున్నారు. ఈ రోజు ఫస్ట్ లుక్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేయడం విశేషం.

సుకుమార్ పర్ఫెక్షన్ ఎలాంటిదో తెలిసిందే. తెలుగులో తీసి మిగతా భాషల్లో నామామాత్రంగా అనువాదం చేయడం కాకుండా అన్ని భాషల్లో అథెంటిగ్గా తీసే ప్రయత్నం చేస్తాడనడంలో సందేహం లేదు. మరి మిగతా వాళ్లు అందుకోలేని ‘పాన్ ఇండియా’ టార్గెట్‌ను బన్నీ-సుక్కు అయినా అచీవ్ చేస్తారేమో చూడాలి.