సాగ‌ర్‌, తిరుప‌తిలో బీజేసీకి సేమ్ సీన్ రిపీట్ ?

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించేశారు. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇటు ఏపీలో విప‌క్షాల‌కు, అటు తెలంగాణ‌లో అధికార‌, విప‌క్షాల‌కు ఒక్కాసారిగా టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ రెండు ఎన్నిక‌లు మిగిలిన పార్టీల‌కు ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం పెద్ద ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఎందుకంటే రెండు చోట్లా కూడా ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు పేరున్న అభ్య‌ర్థులు ఎవ్వ‌రూ లేరు. తిరుప‌తిలో టీడీపీ ఫ‌లితం సంగ‌తి ఎలా ఉన్నా త‌మ అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి పేరును ప్ర‌క‌టించేసింది.

ఇక వైసీపీ జ‌గ‌న్ ఫిజియో థెర‌పిస్ట్ డాక్ట‌ర్ గురుమూర్తి పేరును ఖ‌రారు చేసింది. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి విష‌యంలో త‌క‌రారు మొద‌లైంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ ఏపీలో బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త చూసి ఆమె పోటీ చేయ‌న‌ని చెప్పేశార‌ట‌. ఇప్పుడు మ‌రో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్ట‌ర్ దాస‌రి శ్రీనివాసుల పేరు అనుకుంటున్నా.. తాజాగా పుర‌పాలిక ఫ‌లితాలు చూసి ఆయ‌న కూడా వెన‌కంజ వేస్తున్నార‌ని అంటున్నారు. పోటీ చేసినా డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ వ‌ర్గాల‌ను వెంటాడుతోంది.

స‌రే ఏపీ సంగ‌తి ఇలా ఉంటే తెలంగాణ‌లో దుబ్బాక విజ‌యం, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అంచ‌నాల‌కు మించిన విజ‌యంతో బీజేపీ నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీని క‌వ్విస్తూ వ‌స్తోంది. నోటిఫికేష‌న్ రావ‌డానికి ముందు వ‌ర‌కు రంకెలేసిన బీజేపీ తీరా నోటిఫికేష‌న్ వ‌చ్చాక ఎవ‌రిని పోటీ పెట్టాలో తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ జానారెడ్డిని ప్ర‌క‌టించేసింది. ఇటు టీఆర్ఎస్ కూడా దుబ్బాక దెబ్బ‌తో ముందుగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండా బీజేపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాక త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిద్దామ‌ని వేచి చూసే ధోర‌ణితో ఉంది. దుబ్బాకలో సీన్ రిపీట్ అవుతుందేమోనని అధికార పార్టీకి భయం.

దుబ్బాక ఎన్నిక నేప‌థ్యం వేరు. సాగ‌ర్ ఎన్నిక నేప‌థ్యం వేరు. ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లంగా ఉంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీకి డిపాజిట్లు కాదు క‌దా క‌నీసం 2 వేల ఓట్లు కూడా రాలేదు. ఇలాంటి చోట బీజేపీ స‌వాల్ చేసి క‌వ్వించింది. క‌ట్ చేస్తే ఇప్పుడు బ‌ల‌మైన అభ్య‌ర్థే లేని ప‌రిస్థితి. ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎన్నిక‌ల ముందే స‌రైన అభ్య‌ర్థులు లేరు స‌రిక‌దా ? క‌నీసి డిపాజిట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు.