తెలుగు నేల‌పై మూడు పార్టీల ముచ్చ‌ట‌.. దారుణంగా ఉందే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు ద‌శాబ్దాల కింద‌ట ఒక ఊపు ఊపిన క‌మ్యూనిస్టులు.. సుమారు ఏడేళ్ల కింద‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల ప‌రిస్థితి ఏపీలో అత్యంత దారుణంగా త‌యారైంది. రాష్ట్ర విబ‌జ‌న ఎఫెక్ట్‌తో ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌గా.. క‌మ్యూనిస్టుల వ్య‌వ‌హారం చేజేతులా నాశనం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పేరుకే వామ‌ప‌క్షాలు కానీ.. రాజ‌కీయంగా చూస్తే..ఎవ‌రి దారి వారిదే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్క‌డా వీరి మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించడం లేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు.. క‌లిసి పోరాటాలు చేయాల‌ని.. క‌ల‌సి ఎన్నిక‌ల్లో పోరుకు దిగాల‌ని అనుకుంటున్నా.. మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో క‌మ్యూనిస్టులు నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతున్నారు. ఒక‌ప్పుడు టీడీపీతో జ‌ట్టుక‌ట్టిన క‌మ్యూనిస్టులు.. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌తోనూ క‌లిసి రాజ‌కీయాలు చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ టీడీపీ + టీఆర్ఎస్‌తో జ‌ట్టుక‌ట్టారు. అయితే.. ఎక్క‌డా నిల‌క‌డైన రాజ‌కీయాలు చేయ‌లేదు. అయితే.. ఆయా పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టిన‌ప్పుడు మాత్రం కొన్ని స్థానాల్లో విజ‌యం సాధించినా.. 2014 త‌ర్వాత ఏపీలో అలాంటి ప‌రిస్థితి లేకుండా పోయింది.

వాస్త‌వానికి విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం స‌హా, క‌ర్నూలు, విశాఖ‌, అనంతపురం జిల్లాల్లో ప‌లు ప్రాంతాలు క‌మ్యూనిస్టులకు కంచుకోట‌లు ఉన్నాయి. అయితే.. ఎవ‌రినైతే తిడుతున్నారో.. ఏ పార్టీల‌నైతే.. విమర్శిస్తున్నారో.. వాటితో జ‌ట్టుక‌ట్టిన ఫ‌లితంగా క‌మ్యూనిస్టులు ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోతున్నారు. 2019 ఎన్నిక‌ల‌ప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నా.. ఫ‌లితం రాబ‌ట్టుకోలేక పోయారు. ఈ క్ర‌మంలో త‌మ‌ను న‌మ్మే కార్య‌క‌ర్త‌ల‌ను ప‌క్క‌న పెట్టడం పార్టీల‌కు శ‌రాఘాతంగా మారిపోయింది. నిజానికి ఒక‌ప్పుడు వీళ్లు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై దృష్టిపెట్టారు. పేద‌ల ప‌క్షాన ఉద్య‌మాలు చేసేవారు. అయితే.. రానురాను.. రాష్ట్రంలో చంద్ర‌బాబు ఉన్నా.. ఇప్పుడు జ‌గ‌న్ ఉన్నా.. ఆయా ప్ర‌భుత్వాలే పేద‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టిపెడుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ హ‌యాంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌రావ‌డం, ప్ర‌జ‌ల‌కు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా.. నిధులు చేతికే అందించ‌డం వంటివి క‌మ్యూనిస్టులకు ప‌నిలేకుండా చేశాయి. దీంతో క‌మ్యూనిస్టుల ప్ర‌భావం త‌గ్గిపోయింది. ఇక‌, ఈ రెండు పార్టీల ప‌రిస్థితి కాంగ్రెస్‌తో స‌మానంగా మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక్క‌డ ఇంకో కీల‌క విష‌యం ఏంటంటే.. క‌మ్యూనిస్టులను క‌లుపుకొని వెళ్లేందుకు ఇత‌ర పార్టీలు మొగ్గు చూపే ప‌రిస్థితి ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీని క‌లుపుకొని వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో క‌మ్యూనిస్టుల‌కు ఎడ్జ్ ఉన్నప్ప‌టికీ.. స‌రైన నిర్ణ‌యం తీసుకోని కార‌ణంగా వారు ఎప్ప‌టిక‌ప్పుడు త‌డ‌బ‌డుతున్నారు. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా క‌మ్యూనిస్టులు ఉమ్మ‌డిపోరు సాగించ‌లేక పోయారు. సీపీఐ లోపాయికారీగా కొన్ని చోట్ల‌.. బ‌హిరంగంగా కొన్ని చోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది.

ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో సీపీఎం 2 చోట్ల విజ‌యంసాధించ‌గా.. సీపీఐ నాలుగు వార్డుల‌ను ద‌క్కించుకుంది. అయితే.. ఓటు బ్యాంకు మాత్రం దారుణంగా ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఎన్నిక‌ల్లో సీపీఐకి 0.81 శాతం, సీపీఎంకి 0.80 శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే ల‌భించింది. అదే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 1 శాతం ఓటు బ్యాంకు సాధించాయి. ఇక‌, 0.62 శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు సాధించినా.. ఇది కూడా అసెంబ్లీతో పోల్చుకుంటే 1.5 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు దారుణంగా ప‌డిపోయింది. మొత్తంగా చూస్తే.. ఈ మూడు పార్టీల ప‌రిస్థితి ఇప్ప‌ట్లో కోలుకునేలా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.