‘‘నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు’’.. షర్మిల ఆసక్తికర వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్న రాజన్న కుమార్తె షర్మిల.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పక్కా ప్లాన్ తో తెర మీదకు వచ్చిన ఆమె.. అందుకు తగ్గట్లే ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కొత్త పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటన చేయటంతో పాటు.. తన పార్టీ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేక వాదనలు బలంగా వెల్లడి కాకుండా ఉండటంతో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికి తెలంగాణ అధికారపక్షాన్ని టార్గెట్ చేసిన ఆమె.. అవసరమైన ప్రతి సందర్భంలోనూ పంచ్ లు వేయటంతో పాటు.. కేసీఆర్ సర్కారు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో తాను జగనన్న వదిలిన బాణంగా అభివర్ణించుకున్న షర్మిల..తాజాగా మాత్రం అందుకు విరుద్ధమైన వ్యాఖ్య చేయటం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు తన అన్న జగన్ చేయాల్సిన పాదయాత్రకు బదులుగా తాను చేయటం.. ఆ సందర్భంగా తాను జగన్ వదిలిన బాణంగా చెప్పుకున్నారు.

తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని ఆమె స్పష్టం చేయటం గమనార్హం. తాజాగా లోటస్ పాండ్ లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నేత అక్కినేని సుధీర్ అధ్వర్యంలో పలువురు నేతలు ఈ మీటింగ్ కు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలు..పార్టీ నేతలకు ఉన్న పలు సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేశారు.

తాను బీజేపీకో.. టీఆర్ఎస్ కో బీ టీంగా ఉండాల్సిన అవసరం లేదన్న ఆమె.. ఏప్రిల్ 9న తాను ఖమ్మంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం వేదికగా పార్టీ సమర శంఖారావాన్ని పూర్తిద్దామన్న ఆమె.. లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సభలోనే పార్టీ పేరు.. జెండా.. ఎజెండా తదితర అన్ని అంశాల్ని షర్మిల ప్రకటిస్తుందని చెబుతున్నారు.