మ‌నిషివా దున్న‌పోతువా.. బాబుపై కొడాలి నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్‌కు వ‌చ్చారంటే.. ఆయ‌న మాట్లాడే మాట‌లు విని చెవుల తుప్పు వ‌దిలిపోవాల్సిందే. ఏమాత్రం మాట‌లపై అదుపు ఉండ‌ని ఆయ‌న‌.. ప్ర‌త్య‌ర్థుల్ని దారుణాతి దారుణంగా తిట్టేస్తారు. బూతులు కూడా వాడేస్తారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి త‌న మాజీ బాస్ చంద్ర‌బాబు నాయుడును ఎలా తిట్టిపోస్తున్నారో తెలిసిందే.

ఓ సంద‌ర్భంలో ఆయ‌న చ‌నిపోతే బావుణ్న‌నే కామెంట్ కూడా చేశారు నాని. తాజాగా శ‌నివారం విశాఖ‌ప‌ట్నం గ్యాస్ లీక్ ఉదంతానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన నాని.. చంద్ర‌బాబుపై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నువ్వు మ‌నిషివా దున్న‌పోతువా అంటూ బాబును తిట్టిపోశారు. గ్యాస్ లీక్ ఉదంతంలో చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ నాని ధ్వ‌జ‌మెత్తారు.

‘‘1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో ప్రమాదం జరిగింది. అప్పడెందుకు చంద్రబాబు కంపెనీని మూయించలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కంపెనీ విస్తరణకు అనుమతించారు. ఇప్పుడు చ‌నిపోయిన కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇస్తుంటే.. ఈ కోటి ఇస్తే చ‌నిపోయిన వాళ్లు బ‌తికొస్తారా అని చంద్ర‌బాబు అడుగుతున్నాడు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోయారు. అప్పుడు వాళ్లు బతికొస్తారని రూ.3 లక్షలు ఇచ్చారా? చంద్రబాబు మనిషివా.. దున్నపోతువా?. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చినా సిగ్గు శరం లేదు. విశాఖ వెళ్తే చంద్రబాబును ఎవడు ఆపుతాడు?. కరోనాకు భయపడి అద్ధాల మేడలో చంద్రబాబు అద్దాల మేడలో దాక్కున్నాడు. భయంతో విశాఖ పోలేదు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకొని విమర్శలు చేయాలి. నాలుగు రోజులైతే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది’’ అంటూ నాని విమ‌ర్శించారు.