రామోజీ ఫిల్మ్ సిటీకి చేరిన వైసీపీ రాజకీయం

చీరాల ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి త‌న రాజ‌కీయాల‌ను రామోజీ ఫిలిం సిటీకి మార్చారు. త‌న వ‌ర్గాన్ని అక్క‌డ క్యాంపు చేయించి జోరుగా రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌ర‌ణంలో రేగిన మునిసిప‌ల్ గుబులేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల చీరాల ముసినిపాలిటీలో క‌ర‌ణం.. వైసీపీ అధిష్టానం వ‌ద్ద లాబీయింగ్ చేసుకుని.. త‌న వ‌ర్గానికి బీఫారాలు ఇప్పించుకున్నారు. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నా కూడా జిల్లాలో కొంద‌రు పార్టీ నేత‌ల‌ను త‌న పాత ప‌రిచ‌యంతో మ‌చ్చిక చేసుకున్న క‌ర‌ణం ఒక్క బీఫామ్ కూడా ఆమంచి వ‌ర్గానికి ద‌క్క‌కుండా చేశారు. ఈ క్ర‌మంలో మొత్తం 33 వార్డుల్లో త‌న వారిని నిల‌బెట్టారు. అయితే.. 18 చోట్ల మాత్ర‌మే క‌ర‌ణం వ‌ర్గం విజ‌యం సాధించింది.

ఇక‌, 14 చోట్ల మాజీ ఎమ్మెల్యే ఆమంచి వ‌ర్గం, 1 చోట టీడీపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఇప్పుడు మునిసిప‌ల్ చైర్మ‌న్‌ ఎంపిక జ‌ర‌గ‌నుంది. అయితే.. అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. త‌న వ‌ర్గం ఎక్క‌డ జారిపోతుందోన‌ని.. క‌ర‌ణం తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హుటాహుటిన త‌న వ‌ర్గం కౌన్సెల‌ర్ల‌తో హైద‌రాబాద్ స‌మీపంలోని రామోజీ ఫిలిం సిటీలో క్యాంపు పెట్టారు. వాస్త‌వానికి ఇలాంటి రాజ‌కీయాలు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు తాను వైసీపీకి మ‌ద్ద‌తు దారుడిన‌ని చెప్పుకొనే క‌ర‌ణం.. ఇలా చేయ‌డం అంద‌రినీ నివ్వెర ప‌రుస్తోంది.

పైగా .. ఆమంచి వ‌ర్గాన్ని ధీటుగా ఎదుర్కొన‌లేక చ‌తికిల ప‌డిన క‌ర‌ణం.. కేవ‌లం 18 స్థానాల్లో నే త‌న వ‌ర్గాన్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం.. ఆమంచికి కూడా అనుకూలంగా ఉండ‌డం క‌ర‌ణానికి మ‌రింత ఇబ్బందిగా మారింది. ఆమంచి వ‌ర్గం రెబ‌ల్స్‌గా పోటీ చేస్తేనే ఏకంగా 14 వార్డులు ద‌క్కాయి. నిన్న‌టికి నిన్న జిల్లా మంత్రి బాలినేని మాట్లాడుతూ చీరాల‌లో 32 మంది కౌన్సెల‌ర్లు పార్టీ వారేన‌ని.. అధిష్టానం చెప్పిన‌ట్టుగానే అక్క‌డ చైర్మ‌న్‌, వైఎస్ చైర్మ‌న్ ఎంపిక ఉంటుంద‌ని చెప్ప‌డంతో క‌ర‌ణంతో పాటు ఆయ‌న వ‌ర్గంలో గుబులు మొద‌లైంది.

ఇండిపెండెంట్‌గా రెబ‌ల్స్‌ను దింపి 14 వార్డుల్లో గెలిచిన ఆమంచి వ‌ర్గంకు రెండున్న‌రేళ్లు చైర్మ‌న్ ప‌ద‌వి లేదా ముందుగా వైఎస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంది. అదే జ‌రిగితే చీరాల‌లో క‌ర‌ణంకు అవ‌మాన‌మే… ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న క్యాంపు రాజ‌కీయాల‌కు.. గూడు పుఠానీ పాలిటిక్స్‌కు తెర‌దీశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మునిసిప‌ల్ చైర్మ‌న్ ఎంపిక‌లో అంద‌రూ క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న కూడా క‌ర‌ణంను మ‌రింత‌గా కుదిపేస్తోంది. త‌న వ‌ర్గానికి ద‌క్క‌దేమో.. ఈ ప‌ద‌వి అంటూ.. ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అందుకే బ‌లం ఉండి కూడా ఆయ‌న క్యాంప్ రాజ‌కీయాలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.