టీడీపీ అంటే.. ఒక‌రి క‌ష్టం.. అంద‌రి సుఖ‌మా?

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అంటే.. ఒక‌రు క‌ష్ట‌ప‌డితే.. మిగిలిన వారంతా ఎంజాయ్ చేయ‌డ‌మా? ప‌దవులు అనుభ వించేందుకు మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు ఉంటారా? పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోను., పార్టీని అభివృద్ధి చేయ‌డంలోను మాత్రం వారికి పాత్ర లేదా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి త‌గిలిన ఎదురు దెబ్బ వంటి కీల‌క విష‌యాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క టీడీపీ అభిమానీ.. సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే!

తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ఎఫెక్ట్ జోరుగా ఉంటుంద‌ని. త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని.. భావించిన విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో పార్టీ బ‌క్కెట్ త‌న్నేసింది.

అయితే.. వాస్త‌వానికి ఈ రెండు న‌గ‌రాల్లోనూ నాయ‌కులు జోరుగా ఉన్నారు. గుంటూరులో అయితే.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో అయితే.. ఎంపీ కేశినేని నాని ఏకంగా త‌న కుమార్తెనే.. మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ప‌ట్టుబ‌ట్టి సాధించారు. అయితే.. ఈ రెండు చోట్లా.. ఈ ఇద్ద‌రు ఎంపీలు కూడా విఫ‌ల‌మ‌య్యారు.

ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. పార్టీకి ఈ చివ‌ర నుంచి ఆ చివ‌రి వ‌ర‌కు.. నాయ‌కులు కోకొల్ల‌లుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జులు ఉన్నారు. వీరిని కొన్ని నెల‌ల ముందు.. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నియ‌మించారు.

అదేవిధంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జులు ఉన్నారు. మండ‌లాల క‌న్వీన‌ర్లు ఉన్నారు. వీరంద‌రితోనూ ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నిత్యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీని ఎలా బ‌లోపేతం చేసుకోవాలో వివ‌రించారు. అదేస‌మ‌యంలో వారిలో ధైర్యం కూడా నూరిపోశారు. ఎక్క‌డా ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అయితే.. ప‌లితం మాత్రం త‌ల‌కిందులు అయింది.

మ‌రి క్షేత్ర‌స్థాయిలో పార్టీకి అందివ‌స్తార‌ని భావించిన ఈ నాయ‌కులు ఇప్పుడు ఏమ‌య్యారు? ప‌ద‌వుల కోసం.. పోటీ ప‌డి.. మ‌రీ సాధించుకున్న నేతా గ‌ణం.. ఎందుకు విఫ‌ల‌మైంది. అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రావాల్సి ఉంది. కేవ‌లం చంద్ర‌బాబు క‌ష్టంపైనే ఆధార‌ప‌డ్డారా? ఆయ‌నే అన్నీ చూసుకుంటారులే అనుకున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే టీడీపీ అభిమానుల‌ను వేధిస్తోంది. ఇలానే అయితే.. ఒక్క క‌ష్టం అంద‌రూ దోచుకోవ‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు.