దిల్ రాజు సమర్పించు.. శాకుంతలం

టాలీవుడ్లో సాహసాలకు పెట్టింది పేరైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకడు. ‘సొగసు చూడతరమా’ లాంటి వైవిధ్యమైన సినిమాతో అతను దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత ‘బాల రామాయణం’ లాంటి సాహసోపేత సినిమా తీశాడు. ఆపై ‘ఒక్కడు’తోనూ అతను పెద్ద రిస్కే చేశాడు. అప్పుడు అతడికి వేరే నిర్మాతల అండ దొరికింది కానీ.. కెరీర్లో ఒక దశలో తనను ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ‘రుద్రమదేవి’ లాంటి భారీ ప్రాజెక్టును నెత్తికెత్తుకుని సొంత బేనర్లో రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీయడం గుణకే చెల్లింది.

దీని తర్వాత ‘హిరణ్య కశ్యప’ పేరుతో మరో భారీ చిత్రం తీయాలనుకున్నాడు. దానికి రూ.200 కోట్ల బడ్జెట్ అంచనాలు కూడా సిద్ధం చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యమైంది. అయినా వెనుకడుగు వేయకుండా సొంత బేనర్లో ‘శాకుంతలం’ పేరుతో మరో భారీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు శ్రీకారం చుట్టాడు.

‘రుద్రమదేవి’ సినిమాకు గుణ లాభాలేమీ అందుకున్నది లేదు. అతి కష్టం మీద పెట్టుబడి అయితే వెనక్కి తెచ్చుకున్నాడు. అయినా ఇప్పుడు భారీ ఖర్చుతో కూడుకున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ముందుకు రావడం ఆశ్చర్యమే. ఇప్పుడు ఆయనకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయో అని అంతా సందేహం వ్యక్తం చేశారు. కానీ ఆ లోటు తీర్చడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు సిద్ధమయ్యారు.

సోమవారం ‘శాకుంతలం’ సినిమా ముహూర్త వేడుక నిర్వహించారు. ఇందులో దిల్ రాజు పాల్గొన్నాడు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి కూడా ఈ రోజే వెల్లడైంది. ‘దిల్ రాజు సమర్పించు’.. అంటూ సినిమాకు ట్యాగ్ పడిపోయింది. నిర్మాతగా మాత్రం గుణశేఖర్ కూతురు నీలిమ పేరే వేశారు. రాజు ఈ చిత్రానికి ఫైనాన్స్ మాత్రమే చేస్తున్నారు. లాభ నష్టాలు గుణనే చూసుకోవాలి. పెట్టుబడి పెట్టినందుకు రాజు కోరుకున్నది ఇవ్వాలి. ఆ మేరకు ఒప్పందం జరిగినట్లుంది. ఎలాగైతేనేం రాజు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడంటే గుణకు కొండంత అండ దొరికినట్లే.