పుర పోరు దెబ్బ‌తో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన కోమాలోకేనా..!

ఏపీలో తాజాగా వ‌చ్చిన పుర‌పోరు ఫ‌లితం.. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంది. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లాగానే వార్ వ‌న్‌సైడ్ చేసేసింది. అందునా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి అన్ని ప్ర‌ధాన ప‌క్షాలు కూడా భారీ ఎత్తున ఆయ‌న‌పై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. అవినీతి పెరిగిపోయింద‌ని.. ఇసుక‌, మ‌ట్టి కుంభ‌కోణాలు చేస్తున్నార‌ని, కేంద్రంలోని మోడీ సర్కారుకు అమ్ముడు పోయార‌ని.. ఇలా అనేక కోణాల్లో ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, బీజేపీ మ‌రో కోణంలో విమ‌ర్శ‌లు సంధిస్తూ వ‌చ్చింది. ఏపీలో అభివృద్ధి లేద‌ని.. ఏదైనా జ‌రిగితే.. అది త‌మ‌వ‌ల్లేన‌ని చెబుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన‌.. ఎన్నిక‌లు రెఫ‌రెండంగానే భావించారు నాయ‌కులు.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని విజ‌య‌వాడ‌, గుంటూరుల్లో నిర్వ‌హించిన రోడ్ షోల‌లోనూ ప్ర‌తిబింబించారు. టీడీపీని గెలిపించ‌క‌పోతే.. మూడు రాజ‌ధానుల‌కు అంగీక‌రించిన‌ట్టేన‌ని చెప్పారు. అయితే.. అనూహ్యంగా ఈ ఫలితం వైసీపీకి వ‌న్‌సైడ్‌గా వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఈ పార్టీల ప‌రిస్థితి ఇబ్బందిలో ప‌డిపోయింది. అయితే.. అదే స‌మ‌యంలో ఈ పార్టీల‌కు అనేక పాఠాలు నేర్పుతున్నాయి.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు. పైకి క‌నిపిస్తున్న‌ట్టుగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితం.. టీడీపీకి, జ‌న‌సేన‌కు, బీజేపీకి షాక్ మాత్ర‌మే కాదు. ప్ర‌జ‌ల కోణం.. ఈ పార్టీల‌పై ప్ర‌జ‌ల అవ‌గాహ‌న వంటివి కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. టీడీపీలో స్థిర‌మైన పాలిటిక్స్ క‌నిపించ‌డం లేదు. 40 ఏళ్ల సీనియ‌ర్ అని చెప్పుకొనే చంద్ర‌బాబు.. కేంద్రాన్ని గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌లేక పోతున్నారు. ఇక బీజేపీ ఏపీని నాశ‌నం చేస్తున్నా.. జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం ఆపార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. పైగా విశాఖ ఉక్కువంటి కీల‌క అంశం తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. ఇక‌, రాష్ట్ర బీజేపీ నేత‌లు.. కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌ను ఒప్పించి.. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను రాబ‌ట్ట‌లేక పోతున్నారు. ఇలా… ప్ర‌జ‌ల్లో ఈ మూడు పార్టీల‌పై తీవ్ర‌మైన అసంతృప్తి ఉంది. ఇదే ఇప్పుడు ఎన్నిక‌ల రూపంలో వెల్ల‌డైంది.

అయితే.. అదే స‌మ‌యంలో వైసీపీపైనా కొంత మేర‌కు అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భ‌రోసా, వాహ‌న మిత్ర‌, పింఛ‌న్లు.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌యోజనం క‌లిగిస్తుండ‌డం.. ఒకింత ఊర‌ట క‌లిగించింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. మొత్తంగా చూస్తే.. కీల‌క పార్టీలైన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు ఈ ఎన్నిక‌లు.. కేవ‌లం ఓటమి కాదు.. వారికి భ‌విష్య‌త్తును నిర్దేశించుకునేందుకు ప్ర‌జ‌లు క‌ల్పించిన ఒక అవ‌కాశంగా అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీని నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారా? లేక ఇంకా జ‌గ‌న్‌ను తిడుతూ కూర్చుంటారా? అనేది వేచి చూడాలి.