బీజేపీకి మొదలైన టెన్షన్

మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం బీజేపీపై మొదలైంది. పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రైతుసంఘాలు కమలంపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఏ పార్టీకైనా ఓట్లేయండి కానీ బీజేపీకి మాత్రం వేయవద్దంటు రైతుఉద్యమ సంఘం ఆధ్వర్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా కీలక నేత యోగేంద్ర యాదవ్ ప్రచారం మొదలుపెట్టారు.

యోగేంద్ర ఆధ్వర్యంలో బెంగాల్లోని రైతుసంఘాలు బీజేపీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. బెంగాల్ ఎన్నికల్లో కమలంపార్టీ ఓడిపోతేకానీ నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రప్రభుత్వం ఆలోచించదని యోగేంద్ర స్పష్టంగా చెబుతున్నారు. శని, ఆదివారాల్లో కిసాన్ మహా పంచాయత్ పేరుతో రైతుసంఘాల నేతలు రాకేష్ సింగ్ తికాయత్, యధువీర్ సింగ్ బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.

కేంద్రప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో భాగంగా పైన చెప్పిన కీలక నేతలు భవానీపూర్, నందిగ్రామ్, సింగూర్, అసన్ సోల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అంటే ఒకవైపు మమతబెనర్జీ నరేంద్రమోడి, అమిత్ షా తదితరులపై విరుచుకుపడుతుంటే మరోవైపు రైతుసంఘాల నేతలు కూడా బీజేపీ వ్యతిరేక ప్రచారంలో జోరు పెంచబోతున్నారు. దాంతో బీజేపీ నేతలకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.

ఎందుకంటే రాకేష్ తికాయత్ బలమైన రైతు నేత. ఈయన ప్రభావం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్ధాన్, బెంగాల్, మహారాష్ట్రలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దళిత్ పంచాయత్ కూడా కేంద్రప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ చేసింది. తికాయత్ పిలుపుకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు దళిత్ పంచాయత్ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి బెంగాల్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అగ్రనేతలకు టెన్షన్ పెరిగిపోతోంది.