రాజకీయారంగేట్రంపై తారక్‌ లేటెస్ట్ కామెంట్

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ ఈనాటిది కాదు. పాతికేళ్ల వయసున్నపుడే.. 2009 ఎన్నికల్లో అతను తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు. ఐతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో తారక్ రాజకీయాలకు దూరం అయిపోయాడు. తర్వాత ఎప్పుడూ ఇటువైపు చూడలేదు. అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

ఐతే తారక్‌కు పార్టీ నుంచి అయితే ఆహ్వానం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మరి తారక్‌కు రాజకీయాల్లోకి రావడంపై మనసులో ఏముందో జనాలకు తెలియట్లేదు. ఈ విషయంపై ఎప్పుడు ప్రశ్నించినా.. తారక్ సమాధానం దాటవేస్తూనే ఉన్నాడు. తాజాగా అతను హోస్ట్ చేయబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. అందులోనూ తారక్‌కు రాజకీయారంగేట్రంపై ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు తారక్ సమాధానం ఇస్తూ.. ‘‘ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సమయం కాదు. సందర్భమూ కాదు’. తర్వాత మనం కాఫీ తాగుతూ తీరిగ్గా ఆ విషయం గురించి కబుర్లు చెప్పుకుందాం’’ అని చెప్పాడు. ఐతే మరి తారక్ అలా కాఫీ తాగుతూ మీడియా వారితో పొలిటికల్ కబుర్లు చెప్పుకునే రోజు ఎప్పుడొస్తుందన్నదే ప్రశ్నార్థకం.

‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లు తీసుకోవడంపై తారక్ స్పందిస్తూ.. ఆ సినిమా అంత డిమాండ్ చేయడం వల్ల సమయం వెచ్చించాల్సి వస్తోందన్నాడు. అలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగమైనందుకు గర్విస్తున్నానని.. మన హీరోలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చే సినిమా ఇదవుతుందని తారక్ అన్నాడు. ఈ మూడేళ్లలో షూటింగ్‌ విరామాల్లో తన ఇద్దరు పిల్లల కోసం చాలా సమయం కేటాయించానని, అది తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని, అంతకుమించి తాను కోరుకునేదేమీ ఉండదని తారక్ చెప్పాడు.