షాక్‌లో పవన్‌ అభిమానులు

అవును.. పవర్ స్టార్ పవన్ అభిమానులు ఇప్పుడు షాక్‌లోనే ఉన్నారు. కాకపోతే వాళ్లను బాధ పెట్టే షాక్ కాదది. అదొక స్వీట్ షాక్. ఈ షాక్ ఇచ్చింది దర్శకుడు క్రిష్. ‘యన్.టి.ఆర్’ సినిమాతో పరాభవం మూటగట్టుకున్న క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అనగానే ఆయన అభిమానుల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. ఈ టైంలో క్రిష్‌తో సినిమా ఏంటి అన్న వాళ్లే ఎక్కువ.

పవన్ చేస్తున్న మిగతా చిత్రాలతో పోలిస్తే దీనికి పెద్దగా హైప్ కనిపించలేదు. ఈ సినిమాకు సంబంధించి మిగతా అప్‌డేట్స్ కూడా అంతగా ఆసక్తి రేకెత్తించలేదు. కాకపోతే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అన్న సమాచారం మాత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఐతే క్లాస్ డైరెక్టర్ అయిన క్రిష్.. పవన్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న సందేహాలు మాత్రం కొనసాగాయి. ఐతే మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ చూశాక మాత్రం పవన్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేశాయి.

ప్రభాస్ ‘బాహుబలి’ చేశాక.. టాలీవుడ్ అభిమానులందరూ తమ హీరోలను కూడా అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న, ఎపిక్ మూవీస్‌లో చూసుకోవాలని ఆశపడ్డారు. అవి పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని కోరుకున్నారు. ఐతే అందరు అభిమానులకూ ఆ ఆశ తీరలేదు. చిరంజీవి ఒక్కడు ‘సైరా’తో ఆ తరహా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. పవర్ స్టార్‌కు ఉన్న క్రేజ్, బాక్సాఫీస్ స్టామినాకు సరైన పీరియడ్ మూవీ పడితే దాని రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఐతే తన క్యాలిబర్‌కు తగ్గ సినిమాలు పవన్ సెట్ చేసుకోడనే విమర్శ ఉంది. గత కొన్నేళ్లలో పవన్ చేసిన సినిమాల వరస చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

ఐతే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్నది.. అచ్చంగా అభిమానులు కోరుకుంటున్న సినిమానే. క్రిష్‌ను తక్కువగా అంచనా వేశారు కానీ.. ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఇది ఒక ఎపిక్ మూవీ కావడానికి స్కోప్ ఉన్నట్లే కనిపిస్తోంది. సరిగ్గా తీస్తే ఈ సినిమా రేంజే వేరుగా ఉంటుందనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్‌లో అవతారం, స్క్రీన్ ప్రెజెన్స్, భారీతనం చూసి పవన్ అభిమానులు షాకైపోయిన మాట వాస్తవం. మరి సినిమాతో వారిని మరింతగా షాక్‌కు గురి చేస్తాడేమో క్రిష్ చూడాలి.