చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న చిత్తూరు జిల్లా

ఊరును ఏలటానికి ముందు ఇంటిని గెలవాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్రాన్ని ఏలాలన్న తపన పడటానికి ముందు సొంత జిల్లాలో తిరుగులేని బలాన్ని ప్రదర్శించాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలో వైసీపీ తప్పించి.. మరే పార్టీ ఉనికి కనిపించదు. ఎంత కష్టపడ్డా.. కడప జిల్లాలో వైసీపీ మినహా మరో పార్టీకి అవకాశమే ఉండదు. మరి.. టీడీపీ అధినేత చంద్రబాబుప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా ఇప్పుడాయనకు కొత్త చింతగా మారిందని చెప్పాలి.

గతంలో ఎప్పుడూ ఎదురుకాని గడ్డు పరిస్థితిని ఆయనిప్పుడు ఎదుర్కొంటున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. అప్పటివరకు పక్కనే ఉన్న సన్నిహిత నేతలు అయితే బీజేపీ.. కాదంటేవైసీపీలోకి జంప్ కావటం ఒక ఎత్తు అయితే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో తనకు వీస్తున్న ఎదురుగాలి అంతకంతకూ ఎక్కువ కావటం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని14 అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాల్ని వైసీపీ సొంతం చేసుకోవటం ద్వారా.. క్లీన్ స్వీప్ కు కాస్త దూరంలో ఆగింది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోకూడా మొదటి రెండు రౌండ్లలో వెనుకబడి ఉండటం అప్పట్లో షాకింగ్ గా మారింది. కిందామీదా పడి అధిక్యతను ప్రదర్శించి బయటపడటంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్ని రాజకీయ పార్టీలకు ముడి పెట్టలేమని ఎంత చెబుతున్నా.. ఫలితాల్ని చూసినప్పుడు టీడీపీ అధిక్యత భారీగా తగ్గిపోయింది.

జిల్లాలోని 80 శాతానికి పైగా పంచాయితీల్ని అధికార వైసీపీ సానుభూతిపరులు సొంతం చేసుకున్నారు. చివరకు బాబు సొంత గ్రామమైన నారావారిపల్లె ఉన్న కందులవారిపల్లె పంచాయితీలోనూ వైసీపీ గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 500 ఓట్ల తేడాతో టీడీపీ గెలవటంతో తెలుగు తమ్ముళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే చిత్తూరులో 50 డివిజన్లు ఉంటే 37 ఏకగ్రీవం కాగా.. తిరుపతిలోని 50 డివిజన్లలో 27 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన స్థానాల్లో అత్యధికం అధికార వైసీపీకి చెందినవి కావటం గమనార్హం. మొత్తంగా.. మున్సిపల్ఎన్నికల అనంతరం చిత్తూరు జిల్లాలో టీడీపీ బలం మరింతగా తగ్గిపోనుందని చెప్పక తప్పదు. ఇది బాబుకు మరింత ఇబ్బందికి గురి చేయటం ఖాయం.