మంత్రుల్లో పెరిగిపోతున్న డిసెంబర్ టెన్షన్

అవును మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే టెన్షన్ చాలామంది మంత్రుల్లో పెరిగిపోతోంది. నిజానికి టెన్షన్ పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కనిపించాలి. కానీ మంత్రుల్లో కూడా ఎందుకు పెరిగిపోతోంది ? ఎందుకంటే డిసెంబర్ వస్తోంది కాబట్టే. డిసెంబర్ వస్తుంది, వెళుతుంది ఇంతోటిదానికి టెన్షన్ ఎందుకని సందేహపడుతున్నారా ?

సమస్యంతా ఇక్కడే ఉంది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినపుడే రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మంత్రివర్గాన్ని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఎక్కువమంది గెలవటంతో వీలైనంతమందిని సంతృప్తి పరచటం కోసమే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇపుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గనుక గెలిపించకపోతే డిసెంబర్ ప్రభావం పడితీరుతుందని మంత్రుల్లో ఆందోళన పెరిగిపోతోందట.

డిసెంబర్ రావటానికి ఇంక తొమ్మది మాసాలు మాత్రమే ఉండటంతో పాటు దానికి ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటం చాలామంది మంత్రులకు ఇబ్బందిగా తయారైంది. జగన్ ప్రధాన దృష్టంతా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు లాంటి కార్పొరేషన్ల మీదే ఉంది. వీటిలో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని జగన్ డిసైడ్ చేసిన విశాఖ, ప్రస్తుతం ప్రభుత్వానికి కేంద్రంగా నిలిచిన విజయవాడ కార్పొరేషన్ల గెలుపునే టార్గెట్ చేసుకున్నారట.

జగన్ టార్గెట్ ఏమిటో అర్ధమైపోగానే మంత్రుల్లో టెన్షన్ మొదలైపోయి ఎన్నికల్లో ఉరుకులు పరుగులు పడుతున్నారు. ఉదయాన్నే అభ్యర్ధులతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా ప్రచారంలోకి దిగేస్తున్నారు. పార్టీని గెలిపించాలని మంత్రులు కూడా ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ టెన్షన్ కారణంగానే మంత్రులు నూరుశాతం శ్రమిస్తున్నారని చెప్పాలి. మరి డిసెంబర్ తర్వాత మంత్రివర్గంలో ఉండేదెవరో పక్కకు పోయేదెవరనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది.