అందుకే అందరినీ దూరం పెట్టేశారా ?

విజయవాడ నగరం తెలుగుదేశంపార్టీ నేతలు-చంద్రబాబునాయుడు వ్యవహారంపై పార్టీలో చర్చ పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వచ్చే ముందురోజు పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు రోడ్డుపై పడిన విషయం తెలిసిందే. ఎంపి కేశినేని నాని-ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ+అధికార ప్రతినిధి నాగూల్ మీరా మధ్య ఉన్న విభేదాలతో రచ్చ రచ్చ అయిపోయింది.

పై ముగ్గురు ఎంపిని మీడియా సమావేశంలోనే నోటికొచ్చినట్లు తిట్టారు. తిట్టడమే కాకుండా ఎంపి గనుక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెంట ఉంటే తాము పాల్గొనేది లేదని కూడా అల్టిమేటమ్ ఇవ్వటం పార్టీలో  సంచలనమైంది. వాళ్ళ అల్టిమేటమ్ చూసిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత టీడీ జనార్ధన్ తో ముగ్గురి నేతలతో మాట్లడించినా పెద్దగా ఉపయోగం కనబడలేదని సమాచారం.

అన్నీ విషయాలు ఆలోచించిన చంద్రబాబు చివరకు తన పర్యటనలో పై నేతలందరినీ దూరంగా ఉంచేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన రోడ్డుషోలో చంద్రబాబు పక్కన ఎంపి కూతురు కేశినేని శ్వేత కనిపించారే కానీ ఎంపి ఎక్కడా కనబడలేదు. ఇక ఒకటిరెండు చోట్ల  బుద్ధా వెంకన్న కనిపించారే కానీ తర్వాత ఆయనా అడ్రస్ లేరు. బోండా, నాగూల్ పర్యటనలో పాల్గొన్నారో లేదో కూడా తెలీదు.

వీళ్ళందరి వ్యవహరం ఇలాగుంచితే మాజీమంత్రి దేవినేని ఉమ పరిస్ధితి అయితే మరీ అన్యయమైపోయింది. చంద్రబాబు ఎప్పుడు రోడ్డుపైకి వచ్చిన పక్కనే కనిపించే దేవినేని అసలు ఎక్కడా కనబడలేదు. దేవినేనికి ఎంపికి కూడా ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు ఎంపి కూతురే మేయర్ అభ్యర్ధి కావటంతో రోడ్డుషోల్లో ఆమె చంద్రబాబు పక్కనే ఉన్నారు. అందుకనే చంద్రబాబు వాహనంలో ఉమ పాల్గొనలేదని సమాచారం.

మొత్తానికి రోడ్డుషో జరిగిన తీరు చూస్తుంటే చంద్రబాబే అందరినీ గంపగుత్తగా దూరం పెట్టేసి మేయర్+డివిజన్ అభ్యర్ధులతో ప్రచారం పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. అయినా నేతల మధ్య విభేదాలు ఇంతస్ధాయిలో ఉంటే ఇక పార్టీ అభ్యర్ధులు ఏమి గెలుస్తారు ? గెలిచే అవకాశం లేని సీటు విషయంలో ఇంత గొడవలు దేనికో.