ఇదేం పిలుపు పవన్?

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీ ముందు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు శవాలతో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఆందోళనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఈ ఆందోళనల్లో ఎవరూ పాల్గొనవద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు పవన్ సూచించారు. ఇటువంటి నిరసనల్లో పాల్గొనవద్దని, బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే జనసేన కార్యకర్తలు దృష్టి పెట్టాలని కోరారు. గ్యాస్‌ లీక్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నివేదికలు అందేవరకు వేచి చూద్దామని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోన్న సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు.

కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు చేపట్టిన ఆందోళనల వల్ల వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని పవన్ చెప్పారు. ఆందోళనల వల్ల వైరస్‌ కట్టడి చేసే అంశం మన చేతుల నుంచి జారిపోయే అవకాశం ఉందని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ వ్యాఖ్యలనుబట్టి పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవరూ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేయడం లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంతేకాకుండా, తమ పార్టీలో ఉన్నంత మాత్రాన కార్యకర్తలు ధర్నా చేయొద్దని పవన్ చెప్పడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. తమ ప్రాంతంలో వచ్చిన సమస్యపై బాధ్యతగా స్పందించాలనుకున్న జనసైనికులుకు పవన్ పిలుపు శరాఘాతంగా మారిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వల్ల మరోసారి ప్రమాదం బారిన పడకుండా అక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలించాలని భారీ సంఖ్యలో గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. తమకు రాజకీయ పార్టీల మద్దతు ఉండాలని వారు కోరుకుంటారు.

బాధ్యత గల రాజకీయ పార్టీ ఏదైనా …ప్రజలకు ఇటువంటి కష్టసమయంలో అండగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, పవన్ మాత్రం అందుకు భిన్నంగా….ఆందోళనల్లో పాల్గొనవద్దంటూ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. పవన్ పిలుపు వల్ల పార్టీకి నష్టం జరిగే చాన్స్ ఉంది. కష్టకాలంలో జనసేన తమకు అండగా నిలవలేదన్న అభిప్రాయం జనాల్లో బలంగా పాతుకుపోయే అవకాశం ఉంది.