‘టీ’కి పిలిచి.. ఎదురింటి ఆంటీ అంత పని చేసిందట

నిజంగా నిజం. ఇవాల్టి రోజున ఒకరిని నమ్మలేని పరిస్థితి. బంధాలన్ని ఆర్థికమేనని ఓ పెద్ద మనిషి అప్పుడెప్పుడో చెప్పారు కానీ.. ఈ ఆర్థికం కోసం ఎంతకైనా తెగించే ధోరణి ఇటీవల అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో ఊహించని దరిద్రపుగొట్టు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం తర్వాత.. కొత్తవారు పిలిచిన వెంటనే వెళ్లటం ఎంత ప్రమాదకరమన్న విషయం అర్థం కాక మానదు.

ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకలోని హోస్పేట్ లో ఒక వ్యాపారవేత్త ఉన్నారు. ఆయనకు కొప్పళ్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. దీనికి సంబంధించి ఆఫీస్ హోస్పేటలోని ఎంజే నగర్ లో ఏర్పాటు చేశారు. ఆ ఆఫీసు ఎదురుగా ఉండే ఇంట్లో గీత అనే మహిళ ఉంటున్నారు.

2019లో సదరు వ్యాపారవేత్తకు.. ఎదురింట్లోఉండే గీత పరిచయమయ్యారు. అలా పెరిగిన వారి స్నేహం.. తర్వాత ఆయన్ను ఒక రోజు టీ కి రావాలని ఇంటికి ఆహ్వానించింది గీత. దీంతో వారింటికి వెళ్లిన ఆయన టీ తాగారు. కాసేపటికి ఆయన మూర్ఛబోయాడు. గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లారు.

రెండు రోజుల తర్వాత ఫోన్ చేసిన గీత.. ‘మీ నగ్నవీడియోలు నా దగ్గరఉన్నాయి. రూ.30లక్షలు ఇచ్చి సీడీలు తీసుకెళ్లండి’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో.. ఆయనకు బొమ్మ తిరిగింది. టీకి పిలిచి.. తనకేదో చేశారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. చేసేదేమీ లేక గీత బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షలు బదిలీ చేశారు. మిగిలిన రూ.15 లక్షల కోసం గీత తీవ్రంగా ఒత్తిడి చేసింది.

దీంతో.. ఆమె వేధింపులకు తట్టుకోలేని ఆ స్టీల్ కంపెనీ యజమాని.. పోలీసుల్ని ఆశ్రయించి జరిగిందంతా చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గీత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా2750 గ్రాముల గంజాయి లభించింది. గీతతో పాటు.. ఆమెకు సహకారం అందించే ఆమె కొడుకు విష్ణును అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపర్చారు. ఇప్పుడు అర్థమైందా? ఎదురింటి ఆంటీ టీకి పిలిచారనో.. మరొక దానికి రమ్మన్నారని వెనుకా ముందు చూసుకోకుండా వెళితే.. అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. బీకేర్ ఫుల్.