పవన్-రానా సినిమా నుంచి ఆమె కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి హీరోయిన్లు తహతహలాడుతుంటారు. కానీ ఇప్పుడాయన సినిమా నుంచి ఒకరికి ఇద్దరు హీరోయిన్లు తప్పుకుంటున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కతున్న చిత్రంలో పవన్.. రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌కు జోడీగా ఉండే కీలకమైన పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేశారు. అగ్రిమెంట్ కూడా అయింది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటం, పవన్-రానా సినిమాకు డేట్లు సర్దుబాటు చేయాలేకపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె దీన్నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి.

ఐతే ఇప్పుడు ఇందులో మరో కథానాయికగా.. రానాకు జోడీగా నటించాల్సి ఉన్న ఐశ్వర్యా రాజేష్ సైతం తప్పుకుందన్నది తాజా సమాచారం.

తెలుగమ్మాయే అయిన ఐశ్వర్య.. తమిళంలో మంచి స్థాయిలోనే ఉంది. ఆమెకు అవకాశాలకు లోటు లేదు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సహా పలు ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది. ముందు పవన్-రానా కాంబినేషన్ అని టెంప్ట్ అయి ఈ సినిమా ఒప్పుకుందో ఏమో కానీ.. ఇప్పుడు ఆమె కూడా డేట్లు సర్దుబాటు చేయలేకో, మరో కారణంతోనో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సాయిపల్లవిని ఎంచుకున్న పాత్రకే ఒరిజినల్లో ప్రాధాన్యం ఉంటుంది. రానాకు జోడీగా నటించే అమ్మాయి పాత్ర నామమాత్రం. బహుశా అది కూడా ఐశ్వర్య తప్పుకోవడానికి ఓ కారణం అయి ఉండొచ్చు. రచ్చ గెలిచి ఇంట గెలవాలని చూస్తున్న ఐశ్వర్యకు ఇప్పటిదాకా ఏదీ కలిసి రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్యా కృష్ణమూర్తి లాంటి సినిమాలతో తెలుగులో అదృష్టం పరీక్షించుకున్న ఐశ్వర్యకు ఇక్కడ నిరాశే మిగిలింది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆమెకు ఏమేర అవకాశాలు వస్తాయో?