శశికళ ప్రకటన సంచలనం..తెరవెనుక ఏమి జరిగింది ?

తమిళనాడులో చిన్నమ్మగా పాపులరైన శశికళ రాజకీయాలనుండి తప్పుకున్నారు. రాజకీయాల నుండే కాకుండా చివరకు ప్రజాజీవితం నుండి కూడా తప్పుకుంటున్నట్లు శశికళ బుధవారం చేసిన ప్రకటన సంచలనమైంది. ఎవరూ ఊహించని రీతిలో చిన్నమ్మ ప్రకటన చేశారు. జైలు నుండి విడుదల కాగానే అన్నాడీఎంకేకు తానే శాశ్వత ప్రదాన కార్యదర్శినని, ముఖ్యమంత్రి అయిపోవాలనే పట్టుదల కనబరిచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏఐఏడీఎంకేను హస్తగతం చేసుకోవాలని చిన్నమ్మ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో ఆమెను పార్టీ నుండి దూరంగా పెట్టాలని ముఖ్యమంత్రి పళనిస్వామి అండ్ కో ప్రతిఘటిస్తున్నారు. వీళ్ళిద్దరి విషయం ఇలా ఉండగానే బీజేపీ తరపున పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టిగా చిన్నమ్మపై ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే అన్నాడీఎంకే+బీజేపీ మిత్రపక్షాలుగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ దశలోనే బీజేపీ చిన్నమ్మతో మాట్లాడి అన్నాడీఎంకే పార్టీని వదిలిపెట్టేసి తమ కూటమిలో చేరి కమలంపార్టీ తరపున పోటీ చేయాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం.

అంటే శశికళ కోరుకుంటున్నట్లుగా అన్నాడీఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమిత్ హెచ్చరికలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ తరపున పోటీ చేయటం ఇష్టంలేక అన్నాడీఎంకేను వదులుకోవటం ఇష్టంలేని కారణంతో వేరే దారిలేకే చిన్నమ్మ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని ప్రచారం ఊపందుకుంటోంది. అన్నాడీఎంకే విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అమిత్ చేసిన హెచ్చరికలే చిన్నమ్మపై తీవ్ర ప్రభావం చూపినట్లు అనుమానంగా ఉంది.

అమిత్ హెచ్చరికలను గనుక ఖాతరు చేయకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అన్న ఆందోళనే శశికళకు ఎక్కువైపోయిందట. అన్నాడీఎంకేను కాదంటే ఆమె మేనల్లుడు పెట్టిన కొత్త రాజకీయ పార్టీకి పెద్దగా జనాధరణ లేదు. కాబట్టి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. చేస్తే అన్నాడీఎంకే పార్టీని చేతులోకి తీసుకుని పోటీ చేయాలి. లేకపోతే లేదన్నట్లుగా చిన్నమ్మ అనుకున్నారట. అది సాధ్యం కాదని తేలిపోవటంతోనే చివరకు రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.