షర్మిల పై షాకింగ్ ఆరోపణలు చేసిన రేవంత్

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు రాజన్న కుమార్తె షర్మిల. తెలంగాణలో ఆమె పార్టీని ఏర్పాటు చేయాలన్న సంచలన నిర్ణయాన్ని పలువురు ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. రాజకీయ విమర్శల్లో అందరి కంటే ముందుండే టీఆర్ఎస్ సైతం.. షర్మిల రాజకీయ ఎత్తుగడలను జాగ్రత్తగా గమనిస్తుందే తప్పించి.. తొందరపడి ఒక్క మాట అనని పరిస్థితి. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసే క్రమంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఆమె విద్యార్థులతో భేటీ నిర్వహించారు. తెలంగాణ యువత ఆకాంక్షల్ని నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా వేదిక మీద ఒక విద్యార్థి ఆవేదనతో తన ఉదంతాన్ని చెప్పుకోవటం.. కదిలిపోయిన షర్మిల అతడ్ని ఓదార్చటం అందరిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భావోద్వేగంతో మాట్లాడిన యువకుడు విద్యార్థి ఎంతమాత్రం కాదన్నారు.

షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద జోసెఫ్ అని.. అతడు విద్యార్థి కాదు నిరుద్యోగి అంతకన్నా కాదని తేల్చేశారు. ఆ యువకుడు కల్వరి టెంపుల్ లో ఆర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని పేర్కొన్నారు. అతడి తండ్రి దివంగత మహానేత వైఎస్సార్ కంటే ముందే మరణించారన్నారు. ప్రజల చూపును తన వైపునకు తిప్పుకునేందుకు షర్మిల ఇలా చేస్తున్నారని.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటానికి ముందే ఏపీలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

గతంలో పాదయాత్ర చేసిన షర్మిల.. తన యాత్రలో భాగంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన మాటలకు.. జరిగిన దానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని..ఆ తర్వాతే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలన్నారు. సెంటిమెంట్ తో తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదన్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.