కేసు ఓడిపోయిన నీరవ్ మోడీ.. భారత్‌కు రాక తప్పదు


భారత బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం.. అక్కడి కోర్టులకు ఏవేవో కారణాలు చెప్పి కేసులను సాగదీయడం.. ఇండియాకు చిక్కకుండా తప్పించుకోవడం.. ఇదీ కొందరు ఘరానా మోసగాళ్ల తీరు. ఈ విషయంలో విజయ్ మాల్యా దారి చూపిస్తే అతణ్ని అనుసరిస్తూ మరో వైట్ కాలర్ మోసగాడు నీరవ్ మోదీ కొన్నేళ్ల కింద బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి యూకేకు పారిపోయి అక్కడే కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే.

ఐతే ఎట్టకేలకు నీరవ్ మోడీ పాపం పండింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. తనను భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందన్న నీరవ్ వాదనతో కోర్టు విభేదించింది. అలాగే నీరవ్‌ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టి పారేసింది.

పీఎన్‌బీకి రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో నీర‌వ్ మోడీపై గురువారం లండ‌న్ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఆ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్న‌ట్లు న్యాయ‌మూర్తి శామ్యూల్స్ స్పష్టం చేశారు. నీర‌వ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని.. వాటిని గుర్తిస్తున్నామని జడ్జి పేర్కొన్నారు. ఈ కేసు రెండున్న‌ర ఏళ్లుగా లండన్ కోర్టులో విచార‌ణలో ఉంది.

వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి అత‌ను ఇవాళ వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియ‌జేయ‌నున్నారు. పీఎన్‌బీకి కోట్లు ఎగ‌వేసిన కేసులో నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌ను భార‌త్ కోరుతున్న విష‌యం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో త్వరలోనే నీరవ్ మోడీ భారత్‌లో అడుగు పెట్టక తప్పదని భావిస్తున్నారు. ఇదే తరహాలో విజయ్ మాల్యాను కూడా యూకే నుంచి ఇండియాకు రప్పించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అతను 9 వేల కోట్లకు పైగా బ్యాంకులకు ఎగ్గొట్టి యూకే పారిపోయిన సంగతి తెలిసిందే.