కేంద్రాన్ని వణికిస్తున్న తికాయత్ పిలుపు

భారతీయ కిసాన్ యూనియర్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ తాజాగా ఇచ్చిన పిలుపు కేంద్రప్రభుత్వాన్ని వణికించేస్తోంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే పార్లమెంటును ముట్టడించాలంటు పిలుపిచ్చారు. ఏకంగా 40 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేవించాల, పార్లమెంటును ముట్టడించాలని ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. ఢిల్లీ కవాతుకు ఏ క్షణంలో అయినా పిలుపు రావచ్చని కాబట్టి రైతులంగా అందుకు సిద్ధంగా ఉండాలని తికాయత్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన తికాయత్ పిలుపును యూపీతో పాటు హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాల్లో రైతులు తూచా తప్పకుండా పాటిస్తారు. జాట్ వర్గానికి చెందిన తికాయత్ పై రైతుల్లో అపారమైన నమ్మకముంది. అందుకనే తికాయత్ ఏదైనా పిలుపిచ్చారంటే కేంద్రం వణికిపోతోంది. జనవరి 26వ తేదీన ఢిల్లీ వీధుల్లో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి పిలుపే ఇవ్వటంతో ఏ క్షణంలో ఏమవుతుందో అర్ధంకాక కేంద్రప్రభుత్వం వణికి పోతోంది.

పైగా ఆందోళనలో పాల్గొనే రైతులు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న పార్కులను దున్ని పంటలను సాగు చేయాలని చ తికాయత్ చెప్పటం కలకలం సృష్టిస్తోంది. నిజంగానే తికాయత్ పిలుపును రైతులు ఆచరణలో పెడితే ఇంకేమన్నా ఉందా ? 40 లక్షల ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించటమంటేనే పెద్ద సంచలనంగా చెప్పాలి. అలాంటిది ప్రతి ట్రాక్టర్లోను పదిమంది ప్రయాణించినా 4 కోట్లమంది ఆందోళనకారులు తయారవుతారు. వీరంతా ట్రాక్టర్లేసుకుని ఢిల్లీలోకి ప్రవేశించటం కనబడిన పార్కులన్నింటినీ దున్నటం మొదలుపెడితే ఇంకేమన్నా ఉందా ?

ఇదే సమయంలో కనీస మద్దతుధరలకు కేంద్రం చట్టం చేయకపోతే పంటలను తగలపెట్టేస్తామన్నారు. హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా రైతులు తమ గోధుమ పంటలను తగలబెట్టేసుకుంటున్నారు. పంటల నిల్వల కోసం పెద్ద పెద్ద కంపెనీలు నిర్మించుకున్న గోదాములను కూల్చేస్తామని హెచ్చరించారు.

తికాయత్ తాజా హెచ్చరికలను చూస్తుంటే ముందు ముందు ఉద్యమం హింసాత్మకంగా మారే సంకేతాలు బాగా కనబడుతున్నాయి. అదే గనుక జరిగితే కేంద్రప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడటం ఖాయమే. మరి పరిస్దితులు అంతవరకు రాకుండా చూసుకోవటంలో కేంద్రం ఎంతవరకు చొరవ చూపిస్తుందో చూడాల్సిందే.