‘సాహో’ సుజీత్ కొత్త సినిమా ఖరారు

టాలీవుడ్ యువ దర్శకుడు సుజీత్‌ది విచిత్రమైన ప్రయాణం. ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకుండా కేవలం షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో 24 ఏళ్ల వయసులో అతను దర్శకుడిగా అరంగేట్రం చేసేశాడు. తొలి ప్రయత్నంలోనే ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన తొలి చిత్రం ఇదే.

తొలి సినిమాకు ఎన్నో రెట్ల బడ్జెట్లో, ఎంతో భారీగా ఈ సినిమా తీశాడు సుజీత్. కానీ ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. తొలి సినిమా అందలాన్ని ఎక్కిస్తే.. రెండో సినిమా పాతాళానికి తొక్కేసింది. ‘సాహో’ రిలీజైన ఏడాదిన్నర తర్వాత కూడా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేని స్థితికి చేరుకున్నాడతను. తెలుగులో ‘లూసిఫర్’ రీమేక్ అని, హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ అని.. మరొకటని సుజీత్ కొత్త సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.

ఐతే ఎట్టకేలకు సుజీత్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అతను ఈసారి హిందీ సినిమా తీయబోతుండటం విశేషం. జీ స్టూడియోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అతడితో అసోసియేట్ అయింది. ఈ చిత్రానికి తారాగణం ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నట్లు మాత్రం జీ స్టూడియోస్ అధికారికంగానే ప్రకటించింది. ఓ మీడియా సంస్థతో సుజీత్, జీస్టూడియోస్ సీఈవో షరీఖ్ పటేల్ మాట్లాడుతూ తమ కలయికలో సినిమా రాబోతున్నట్లు ధ్రువీకరించారు.

‘సాహో’ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని, దాని తర్వాత తాను చేయబోయేది ఎమోషన్ మిక్స్ అయిన యాక్షన్ థ్రిల్లర్ అని సుజీత్ వెల్లడించాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నట్లు సుజీత్ తెలిపాడు. సుజీత్ అద్భుతమైన స్క్రిప్టుతో తమను మెప్పించాడని, విజువల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని పటేల్ వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించనున్నారు.