‘ఉప్పెన’లో కృతి లేకపోయుంటే..

‘ఉప్పెన’ సినిమాతో కొత్తమ్మాయి కృతి శెట్టి దశ తిరిగిపోయింది. గత కొన్నేళ్లలో మరే కొత్త కథానాయికకూ తొలి సినిమాతో ఇంత మంచి పేరు, క్రేజ్ రాలేదు. ‘ఉప్పెన’ రిలీజ్ కాకముందే మూడు సినిమాల్లో ఆమె బుక్ అయిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మూడూ కూడా క్రేజీ సినిమాలే కావడం విశేషం. తొలి చిత్రం రిలీజ్ కాకముందే ఆమె కెరీర్ ఇంత ఊపులో ఉంటే.. ఈ సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో మున్ముందు ఆమె జోరెలా ఉంటుందో?

ఐతే ఇంతగా ఆమెకు కలిసొచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో తనసలు నటించాల్సిందే కాదు. ఆమె ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ కాదన్న సంగతి చాలామందికి తెలియదు. ‘ఉప్పెన’ ప్రారంభోత్సవంలో ఈ చిత్ర కథానాయికగా కనిపించిన అమ్మాయి వేరు. ఇంతకుముందు సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’లో కథానాయికగా నటించిన మనీషా రాజ్ అనే అమ్మాయిని ‘ఉప్పెన’కు కథానాయికగా ఎంచుకున్నాడు బుచ్చిబాబు.

‘ఉప్పెన’ ప్రారంభోత్సవంలోనూ మనీషా పాల్గొంది. కానీ తర్వాత అనూహ్యంగా ఆమె స్థానంలోకి కృతి వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు అనుకోకుండా ఫేస్ బుక్‌లో కృతి ఫొటోలు చూసి ఫిదా అయిపోయాడట. తన కథలో బేబమ్మ పాత్రకు ఈ అమ్మాయే కరెక్ట్ అనుకున్నాడట. కానీ ఒకసారి హీరోయిన్ని ఎంచుకుని ప్రారంభోత్సవంలోనూ ఆ అమ్మాయి పాల్గొన్నాక తప్పించడం ఎలా అని సందేహించాడట.

ఇదే విషయం తన గురువు సుకుమార్ దగ్గర చెబితే.. నీకేమనిపిస్తే అది చెయ్యమని, కథకు ఎవరు బాగుంటారో వాళ్లనే తీసుకోమని సలహా ఇచ్చాడట. దీంతో అతను ధైర్యం చేసి మనీషాను తప్పించి కృతిని ఎంచుకున్నాడు. కృతి, మనీషాలను పక్క పక్కన పెట్టి చూస్తే ‘ఉప్పెన’కు ఎవరు పర్ఫెక్ట్ అనే విషయం స్పష్టమైపోతుంది. మనీషా బేబమ్మ పాత్రకు అంత బాగుండేది కాదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో కృతి నటించకపోయి ఉంటే అన్న ఊహే ఇప్పుడు ప్రేక్షకులను ఇబ్బందికి గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ అవకాశం ఆమె జీవితాన్ని ఎంతగా మార్చిందో చెప్పేదేముంది?