5 వేల మందికి ష‌ర్మిల‌ ఆహ్వానాలు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు ష‌ర్మిల తెలంగాణాలో జోరు పెంచారు. తొంద‌ర‌లోనే పార్టీ పెట్టి రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల అందుకు త‌గ్గ‌ట్లే స‌మావేశాల జోరు పెంచారు. మొద‌టి స‌మావేశం న‌ల్గొండ జిల్లాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో జ‌రిపిన ఈమె తాజాగా అంటే ఖ‌మ్మం జిల్లాలోని మ‌ద్ద‌తుదారులు, అభిమానుల‌తో స‌మావేశం అయ్యారు. ఈనెల 20వ తేదీన అంటే ఈరోజు హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోనే హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల వారితో స‌మావేశం అవనున్నారు.

హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అభిమానులు, మ‌ద్ద‌తుదారులు సుమారు 5 వేల‌మందికి ఆహ్వానాలు పంపారు. అలాగే ఇత‌ర పార్టీల్లో నుండి ష‌ర్మిల పెట్ట‌బోయే కొత్త‌పార్టీలోకి వ‌చ్చే వారెవ‌ర‌నే విష‌యంలో ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ మ‌ద్ద‌తుదారులు, అభిమానుల పై ప్ర‌ధానంగా టార్గెట్ పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ష‌ర్మిల పార్టీ పెట్టి యాక్టివిటి పెంచితే ముందుగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీయే అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

టీఆర్ఎస్ లో చేర‌టం ఇష్టంలేక, కాంగ్రెస్ లో ఉండ‌లేక‌, బీజేపీలో చేర‌లేక ఇప్ప‌టికి నానా అవ‌స్త‌లు ప‌డుతున్న నేత‌లు ప్ర‌ధానంగా రెడ్డి స‌మాజిక‌వ‌ర్గం నేత‌లున్నారు. వీళ్ళ‌లో స‌గం మంది ష‌ర్మిల‌తో చేయి క‌లిపినా పార్టీ లాంచింగే చాలా గ‌ట్టిగా ఉంటుంద‌ని ష‌ర్మిల రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చూస్తున్న కీల‌క నేత‌లు భావిస్తున్నారు. పార్టీ పెట్ట‌కుండా, జెండా ఏమిటో, అజెండా ఏమిటో బ‌య‌ట‌పెట్ట‌లేదు కాబ‌ట్టి అంద‌రికీ ఆస‌క్తిగా ఉంది. అదే ఒక‌సారి అజెండా ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే అపుడు మొద‌ల‌వుతుంది అస‌లు గేమ్. జెండా, అజెండా తయారుచేసే బాధ్యతను షర్మిల ఒక బృందంతో పాటు మరో ఏజెన్సీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

అందుక‌నే ఇప్ప‌టినుండే ష‌ర్మిల పార్టీ జోరును పెంచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకేసారి లోట‌స్ పాండ్ లో 5 వేల‌మందితో స‌మావేశం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే తెలంగాణా వ్యాప్తంగా చాలామందితో ష‌ర్మిల ట‌చ్ లోకి వెళ్ళిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఇపుడున్నంత జోరు పార్టీ పెట్టిన త‌ర్వాత కూడా ఉంటుందా అనేదే అనుమానం. పార్టీ పెట్టేనాటికి ష‌ర్మిల‌తో ఎంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు చేతులు క‌లుపుతార‌నే దానిపై కొత్త పార్టీ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుంది. చూద్దాం ఏమి జ‌రుగుతుందో.