వైసీపీ ఫుల్లు హ్యాపీ

కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే శాసనమండలిలో ఖాళీగా ఉన్న, ఖాళీ అవబోతున్న స్ధానాలను భర్తీ చేయటమే ఇందుకు కారణం. మార్చి 29వ తేదీకి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి రిటైర్ అవబోతున్నారు. ఇక వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగుస్తోంది.

అలాగే మండలి సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ ఎంపిగా వెళ్ళిపోయారు. దాంతో ఆ స్ధానం కూడా ఖాళీ అయ్యింది. ఇక వైసీపీ సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి ఈమధ్యే మరణించిన విషయం తెలిసిందే. సో మొత్తం మీద 6 స్ధానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయనటంలో సందేహం లేదు. అందుకనే అధికారపార్టీ నేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయబోయే స్ధానాలు కాబట్టే ఈ మేరకు శాసనమండలిలో వైసీపీ బలం పెరగటం ఖాయం.

ఆమధ్య మండలిలో ముఖ్యమైన రెండు బిల్లులు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన బిల్లులు మండలిలో మాత్రం వీగిపోతున్నాయి. కేవలం మండలిలో మెజారిటి ఉన్నదన్న ఏకైక కారణంతోనే టీడీపీ నానా గోల చేస్తోంది. పోనీ నిబంధనలకు అనుగుణంగానే అడ్డుకుంటోందా అంటే అదీలేదు. ప్రభుత్వం కీలకమని భావించిన బిల్లులను టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగానే సెలక్ట్ కమిటికి రిఫర్ చేయాలని రబస సృష్టిస్తోంది.

ఇదే పద్దతిలో మండలిలో ఇంకా కొంత కాలం కంటిన్యు అయ్య అవకాశాలున్న కారణంగానే విసిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలి రద్దుకే నిర్ణయం తీసుకున్నారు. మండలి రద్దును అసెంబ్లీలో ఏకంగా ప్రతిపాదన చేసి కేంద్రప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర కారణాలుగా ఆ ప్రతిపాదన ఏ దశలో ఉందో కూడా తెలీదు. అయితే మండలిలో మెల్లిగా వైసీపీ బలం పెరుగుతున్న నేపధ్యంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.