‘దూకుడు’ పేలిపోయే సీన్.. కన్నీళ్లతో ఎమ్మెస్

గత రెండు దశాబ్దాల్లో బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను ప్రేక్షకులను నవ్వించిన కమెడియెన్లలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ గురించి, హావభావాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత సాధారణమైన సన్నివేశాన్నయినా తనదైన నటనతో పండించి ప్రేక్షకులను నవ్వించగల సత్తా ఆయన సొంతం.

ఎమ్మెస్ కామెడీ రోల్స్‌లో అగ్ర భాగాన నిలిచే వాటిలో ‘దూకుడు’లో చేసిన బొక్కా వెంకట్రావు పాత్ర ఒకటి. ఆ పాత్ర తెరపై కనిపించిన తొలి నిమిషం దగ్గర్నుంచి చివరి దాకా ఎంతగా నవ్వించిందో తెలిసిందే. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ‘‘కళ్ల కింద క్యారీ బ్యాగులేసుకుని నువ్వు హీరో అంటే ఎలా నమ్మావురా’’ అంటూ బ్రహ్మానందం ఎమ్మెస్ మీద సెటైర్లు వేసే సన్నివేశంలో ప్రేక్షకుల కడుపు చెక్కలైపోయిందంతే. ఐతే అంతగా నవ్వించిన ఆ సీన్ తీసే సమయానికి ఎమ్మెస్ తీవ్రమైన మనో వేదనలో ఉన్నారట. ఓవైపు కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సన్నివేశంలో నటించారట.

ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో భాగంగా సీనియర్ నటి హేమ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెస్ ‘దూకుడు’లో నటిస్తున్న సమయంలోనే ఆయన భార్య తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు అత్యవసరంగా ఒక మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం పడిందట. ఆమెను హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో చేర్చారట. ఐతే వేరే ఆర్టిస్టుల డేట్లతో ముడిపడ్డ సన్నివేశాలు కావడంతో ఎమ్మెస్ అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చిత్రీకరణకు హాజరు కావాల్సి వచ్చిందట. ఐతే కళ్ల కింద క్యారీ బ్యాగుల డైలాగ్‌కు సంబంధించిన సన్నివేశం తీస్తున్నపుడు షాట్ గ్యాప్‌లో ఎమ్మెస్ బాత్రూంకు వెళ్లి ఏడ్చి మళ్లీ తిరిగొచ్చి షూట్‌లో పాల్గొనేవాడట.

హాస్పిటల్‌కు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో సర్జరీకి సంబంధించిన పేపర్లు లొకేషన్‌కే తెప్పించుకుని సంతకం చేసి పంపారట ఎమ్మెస్. ఆ రోజంతా ఆయన అలాగే నరకం చూశారని హేమ వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్‌పై ఎమ్మెస్ తనయురాలు శశికిరణ్ సైతం స్పందించింది. హేమ చెప్పిందంతా వాస్తవమే అని, అదృష్టవశాత్తూ అప్పుడు తన తల్లికి సర్జరీ విజయవంతమై ఆమె ఆరోగ్యం బాగుపడిందని వెల్లడించింది.