మిస్ ఇండియా 2020గా తెలంగాణ అమ్మాయి మానస

మిస్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేంలోని పలువురు మాజీ మిస్ ఇండియాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీలు ఒక వెలుగు వెలిగారు. అందుకే, మోడలింగ్ లోకి అడుగుపెట్టిన యువతులంతా మిస్ ఇండియా కావాలని కలలు కంటుంటారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి.

అ అందం…అదృష్టం రెండూ మెండుగా ఉన్న మన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మిస్ ఇండియా కలను సాకారం చేసుకుంది. వీఎల్‏సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన పోటీల్లో మానస వారణాసి విజేతగా నిలిచింది.

ఈ పోటీల్లో హరియాణా అమ్మాయి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‏కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‏గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించిన ఈ పోటీల మొదటి రౌండ్‏కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.

వీఎల్‏సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ స్పాన్సర్ చేశాయి. ఈ పోటీల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. మన తెలుగమ్మాయి మానస ఇదే ఊపును కొనసాగిస్తూ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.