షర్మిల వెనుక పీకే.. నిజమెంత?

ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం రాజకీయాల్లో అలవాటే. దానికి నిదర్శనంగా తాజాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయటం. మీడియాలో వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ.. నల్గొండతో పాటు పలు జిల్లాలకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్ని.. ఆయన్ను బలంగా నమ్మే నేతల్ని ఆహ్వానించిన షర్మిల.. తెలంగాణలో తన పొలిటికల్ ఎంట్రీ మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారని చెప్పాలి.

షర్మిల ఒక్కరే ఇంతటి సాహసం చేయగలరా? అందునా.. అన్న జగన్ తో విభేదించి ఒక్కతే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేయటమా? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పక్కా ప్లానింగ్ తోనే రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాలు.. సూచనలతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.

తన సోదరి పార్టీ పెట్టే విషయంపై పీకేతో సీఎం జగన్ చర్చించినట్లు చెబుతారు. షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని.. ఆ రాష్ట్రంలో ప్రభావాన్ని చూపించటానికి అవకాశం ఉందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే కొత్త పార్టీ పెట్టాలన్న షర్మిల ఆకాంక్షకు పీకే మద్దతు ఇచ్చినట్లుగా సమాచారం.

తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రస్తుతం మమతా బెనర్జీకి సేవలు అందిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలు అయ్యాక తెలంగాణ రాజకీయాల మీద ఫోకస్ చేస్తారని.. షర్మిలను 2023లో జరిగే ఎన్నికలకు సిద్ధం చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. రాజకీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.