అప్పుడే వ్యతిరేకత మొదలైపోయిందా ?

ఇంకా కొత్తపార్టీని వైఎస్ షర్మిల ఏర్పాటే చేయలేదు. తాను పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టంగా ప్రకటన కూడా చేయలేదు. రాజన్న రాజ్యంపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకే వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో సమావేశం నిర్వహించినట్లు షర్మిల స్పష్టంగా చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లో జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అయితే షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీపై అప్పుడే వ్యతిరేకత మొదలైపోయింది.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆంధ్రా పార్టీకి తెలంగాణాలో ఏమిపనంటు మండిపడ్డారు. తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమే లేదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు తెలంగాణాలో అవకాశం లేదని చెప్పారు. వైఎస్ షర్మిల వచ్చి తెలంగాణాలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటంటూ గంగుల ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. ఓ మూడు రోజుల క్రితం ఎవరి పేరును ప్రస్తావించకుండానే కేసీయార్ మాట్లాడుతు కొత్తపార్టీ పెట్టడం అంత ఈజీనా అంటు ప్రశ్నించారు.

గతంలో బీజేపీ నేత ఆలె నరేంద్ర, విజయశాంతి పెట్టిన పార్టీలు ఏమయ్యాయంటు ఎద్దేవా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఈ రెండు పార్టీలను టీఆర్ఎస్సే విలీనం చేసేసుకున్నది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చెల్లెలు షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టుడేంది అంటు ఎకసక్కాలాడారు. అన్నమీద కోపం ఉంటే పెట్టే పార్టీ ఏదో ఏపిలోనే పెట్టాలి కానీ తెలంగాణాలో పెట్టడం బావోలేదన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చటం కోసమే షర్మిల పార్టీ పెడుతున్నట్లు మండిపడ్డారు.

బీజేపీ మాజీ ఎంఎల్ఏ ఎంవివిఎస్ ప్రభాకర్ మాట్లాడుతు వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఓ కుట్రగా అభివర్ణించారు. బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే షర్మిలతో కేసీయారే పార్టీ పెట్టిస్తున్నట్లు మండిపడ్డారు. కేసీయార్+జగన్+షర్మిల ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రానీకుండా బీజేపీని ఎవరు అడ్డుకోలేరని పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చేశారు. మొత్తానికి ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీపై అప్పుడే ఇతర పార్టీల నుండి వ్యతిరేకత మొదలైపోయిందంటే ఏమిటర్ధం ?