సచిన్, కోహ్లి కామెంట్లపై కపిల్ పంచ్


ఈ మధ్య రైతు ఉద్యమం మీద భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె తదితరులు చేసిన ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. క్రికెటర్లు ఈ అంశం మీద స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. రైతు ఉద్యమాన్ని ఉపయోగించుకుని దేశంలో అస్థిరత కోసం విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వీరంతా స్పందించారు.

ఐతే ఉద్యమాన్ని అణగదొక్కేందుకు మోడీ సర్కారే ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తోందన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సచిన్, కోహ్లి, రహానె తదితరులు ట్వీట్లు వేశారు. అవి ప్రభుత్వానికి మద్దతుగా, రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా వేసిన ట్వీట్లలాగే ప్రచారం పొందాయి. వీరిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ముఖ్యంగా సచిన్‌ను ఓ వర్గం గట్టిగా టార్గెట్ చేసుకుంది. అతను అధికారంలో ఎవరుంటే వాళ్లకు సపోర్ట్ ఇస్తాడని, కార్పొరేట్ శక్తుల కోసం పని చేస్తాడని విమర్శలు గుప్పించారు నెటిజన్లు. అతణ్ని దారుణంగా ట్రోల్ చేశారు.

కాగా ఇప్పుడీ విషయమై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర స్పందించాడు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడే బోళా మనిషిగా కపిల్‌కు పేరుంది. రైతు ఉద్యమానికి సంబంధించి సచిన్, కోహ్లి తదితరులు చేసిన ట్వీట్లను కపిల్ తప్పుబట్టాడు. కాకపోతే అది వాళ్లు బలవంతం మీద చేశారని ఆయన అభిప్రాయపడ్డాడు. దీని వెనుక ఉన్నది కేంద్ర హోం మంత్రి తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా అని ఆయన ఆరోపించాడు.

ప్రభుత్వానికి మద్దతుగా క్రికెటర్లను అతనే రంగంలోకి దించాడని ఆరోపించాడు. అతడి బలవంతం మీద, తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్లు ట్వీట్ చేశారని కపిల్ అన్నాడు. క్రికెటర్లను ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని.. క్రికెటర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలని కపిల్ అన్నాడు. క్రికెటర్లతో ఇలాంటి ఆటలు ఆడొద్దని ఆయన కఠువుగానే మాట్లాడారు. ఐతే కపిల్‌కు వ్యతిరేకంగా వెంటనే కొందరు విమర్శలు మొదలుపెట్టేశారు. ఆయన్ని మరింతగా టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.