షాక్: ఐదుగురికి ఇవ్వాల్సిన టీకా ఒక్కరికే ఇచ్చేశారు.. తర్వాతేమైంది?

కరోనా టీకా గురించి అందరికి తెలిసిందే. తొలుత ఒక డోస్ ఇస్తారు. నెల రోజుల తర్వాత మరో డోస్ ఇస్తారు. తొలుత తీసుకున్న కంపెనీకి సంబంధించిన డోస్ నే రెండో దఫా తీసుకోవాలి. అలాంటిది అందుకు భిన్నంగా ఐదుగురికి ఇవ్వాల్సిన డోస్ ను ఒకరికే ఇచ్చేస్తే? విన్నంతనే గుండెలు అదిరిపోయేలా ఉన్న ఈ పరిణామం సింగపూర్ లో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన నేషనల్ ఐ సెంటర్ లోని సిబ్బంది ఒకరికి పొరపాటున ఐదు ఫైజర్ టీకా డోసుల్ని ఇచ్చేశారు. జనవరి రెండో వారంలో జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

ప్రోటోకాల్ ప్రకారం ఫైజర్ టీకాను డైల్యూట్ చేసి.. దాని తీవ్రతను ఐదో వంతుకు తగ్గించిన తర్వాత టీకా ఇవ్వాలి. అయితే.. టీకాను డైల్యూట్ చేసే పని ప్రారంభించిన సిబ్బంది.. మరో పనిలోకి వెళ్లటం.. డైల్యూట్ అయ్యిందన్న ఉద్దేశంతో పోరపాటుగా.. టీకాను నేరుగా ఇచ్చేశారు. అంటే.. ఒక డోసుకు బదులుగా ఐదు డోసులు ఇచ్చారన్న మాట. జరిగిన తప్పిదాన్ని సిబ్బంది వెంటనే గుర్తించారు.

వెంటనే.. తాము చేసిన తప్పును సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వారు.. సదరు వ్యక్తిని పరిశీలించారు. పరీక్షలు జరిపారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. అతన్ని రెండు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. అయినప్పటికి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చిన తర్వాత.. అతడ్ని డిశ్చార్జి చేశారు.

డిసెంబరు 30న సింగపూర్ లో టీకా కార్యక్రమాన్ని షురూ చేశారు. అనుకున్న ప్రకారం సాగితే.. ఈ ఏడాది చివరికి ప్రజలందరికి టీకా అందుతుందని భావిస్తున్నారు. ఏమైనా.. ఐదుగురికి వేసే టీకా.. ఒకరికే వేయటం.. దాని కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవటం.. లక్కీగా భావిస్తున్నారు.