ఫైజర్ వ్యాక్సిన్‌కు ఇండియాలో మొండి చేయి


ఇండియాలో ఇప్పటికే వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన ‘కోవిషీల్డ్’తో పాటుగా దేశీయ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాగ్జిన్’లను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజూ లక్షలమందికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఐతే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రభుత్వం అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి ఏళ్ల సమయం పట్టేలా ఉంది.

ఈ నేపథ్యంలో విదేశాల్లో తయారైన కొన్ని ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్లకు ఇండియాలో అనుమతులిచ్చి ప్రైవేట్ సెంటర్లలో జనాలు నేరుగా టీకా వేయించుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇండియాలో చాలామంది ధనవంతుల దృష్టి ప్రఖ్యాత ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ మీద ఉంది. అమెరికాలో ప్రస్తుతం వేస్తున్నది ఈ కంపెనీ టీకానే. దాని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది.

ఐతే మన లోకల్ వ్యాక్సిన్ల కంటే ఫైజర్ మీద ఎక్కువ గురి ఉన్న ధనవంతులు ఇండియాలోకి ఫైజర్ వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఇండియాలో ప్రవేశానికి అనుమతులు కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి మొండిచేయి చూపించింది. అత్యవసర అనుమతుల కోసం ఫైజర్ సంస్థ చేసిన విజ్ఞప్తిని భారత ఔషధ నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ తిరస్కరించింది.

ఫైజర్ సమర్పించిన డేటా సంతృప్తికరంగా లేదని, ఈ వ్యాక్సిన్ భారతీయులకు సురక్షితం అనడానికి తగ్గ ఆధారాలు ఇందులో లేవని పేర్కొంటూ ఫైజర్‌కు అనుమతులు నిరాకరించింది. అగ్ర రాజ్యం అమెరికాలో అనుమతులు పొందిన, ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న కొవిడ్ వ్యాక్సిన్లలో అత్యుత్తమమైంది కాగలదని ముందు నుంచి నిపుణులు పేర్కొంటున్న వ్యాక్సిన్‌కు ఇండియాలో ఇలా తిరస్కారం ఎదురు కావడం ఆశ్చర్యమే. అదే సమయంలో మన కోవాగ్జిన్‌‌కు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కడం విశేషం.