రాజశేఖర్‌తో ఆ నిర్మాత ప్యాచప్

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌కు, సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఒక సమయంలో తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. రాజశేఖర్ ‘అల్లరి ప్రియుడు’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ అందుకున్నాక ఆయనతో ‘వేటగాడు’ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు తమ్మారెడ్డి. హిందీలో బ్లాక్‌బస్టర్ అయిన ‘బాజీగర్’ హక్కులు కొని స్వీయ నిర్మాణంలో రాజశేఖర్‌తో రీమేక్ చేశారాయన.

ఐతే ‘అల్లరి ప్రియుడు’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ తర్వాత రాజశేఖర్‌కు నెగెటివ్ టచ్ ఉన్న ఆ పాత్ర అస్సలు సూట్ కాలేదు. ఇంకా వేరే కారణాలు కూడా తోడై సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా తనను రోడ్డు మీదికి తెచ్చేసిందని చాలా సార్లు బాధ పడ్డారు తమ్మారెడ్డి. ‘వేటగాడు’ డిజాస్టర్ కావడానికి కారణం రాజశేఖరే అని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు.

రాజశేఖర్ షూటింగ్‌కు సమయానికి రాడని, క్రమశిక్షణ ఉండదని, అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడని తెలిసిన వాళ్లు చెప్పినా వినకుండా ఆయనతో సినిమా చేసి దెబ్బ తిన్నానని కొన్నేళ్ల కిందట కూడా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు తమ్మారెడ్డి. దీనిపై తర్వాత రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తమ్మారెడ్డిపై విమర్శలు గుప్పించారు. తనకు ఆయన పారితోషకం ఎగ్గొట్టినట్లు రాజశేఖర్ ఆరోపించారు. ‘వేటగాడు’ వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా వీళ్లు ఒకరిపై ఒకరు అంత ఆగ్రహంతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ మళ్లీ కలుస్తారని ఎవరూ అనుకోలేదు.

ఐతే ఆశ్చర్యకరంగా తమ్మారెడ్డి సమర్పణలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ పేరుతో కొత్తగా ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లలిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. దీని ప్రి లుక్ తాజాగా రిలీజ్ చేశారు. అందులో పోస్టర్ మీద ‘తమ్మారెడ్డి భరద్వాజ ప్రెజెంట్స్’ అని కనిపించడం ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్ల తర్వాత తమ్మారెడ్డి, రాజశేఖర్‌ల మధ్య విభేదాలు తొలగిపోయి సినిమా చేస్తున్నారే అని చర్చించుకుంటున్నారు. సతీశ్ వేగేశ్నతో ‘కోతి కొమ్మచ్చి’ చేస్తున్న ఎంఎల్వీ సత్యనారాయణ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.