ఫిబ్రవరిలో సినిమాల మోత.. విజేత ఎవరు?

మామూలుగా అయితే ఫిబ్రవరిని అన్ సీజన్‌గా భావిస్తారు. ఆ నెలలో పెద్దగా పేరున్న సినిమాలు విడుదల కావు. కానీ గత ఏడాది కరోనా కారణంగా గత ఏడాది చాలా సినిమాలు పెండింగ్‌లో పడిపోవడం, ఆదాయానికి బాగా కోత పడటంతో ఈసారి అన్ సీజన్ అని కూడా చూడకుండా ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేయబోతున్నారు. ఎప్పట్లా స్కూళ్లు, కాలేజీలు పూర్తి స్థాయిలో నడవకపోవడం, చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో ఫ్యామిలీస్ బాగానే వచ్చి సినిమాలు చూస్తారన్న ఆశతో నిర్మాతలున్నారు. ఈ నెలలో రెండంకెల సంఖ్యలో సినిమాలు విడుదల కానుండటం విశేషం.

అందులో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అన్నింట్లోకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా అంటే.. ‘ఉప్పెన’నే. మెగా ఫ్యామిలీ నుంచి కొత్త కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతుండగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతోనే దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. దేవిశ్రీ పాటలతో పాటు టీజర్, ఇతర ప్రోమోలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక గత ఏడాది ‘భీష్మ’తో ఫిబ్రవరిలో హిట్ కొట్టిన నితిన్.. ఈసారి ‘చెక్’ను ఈ నెలలోనే రేసులో నిలిపాడు. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను రూపొందించడంతో ఇది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఓ వర్గం ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సందీప్ కిషన్ సినిమా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇది తమిళ హిట్ సినిమాకు రీమేక్ కావడంతో బాగా ఆడుతుందనే నమ్మకాలున్నాయి.

ఇక ఫిబ్రవరి తొలి వారంలో విడుదలవుతున్న ‘జాంబి రెడ్డి’కి కూడా ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ ఉంది. ఈ నాలుగు సినిమాలకు తోడు 12న ‘శశి’, ‘ఎఫ్సీయుకె’, 26న ‘అక్షర’ సహా కొన్ని చిన్న చిత్రాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. మరి వీటిలో విజేతగా నిలిచే సినిమా ఏదో చూడాలి. ఉప్పెన, చెక్ చిత్రాల్లోనే ఏదో ఒకటి టాప్‌లో నిలుస్తుందని అంచనా.