నీడ్ ఆఫ్ ది అవర్..జగన్ గోపూజ

రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి.

ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా కనుమపండుగ రోజు శుక్రవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోపూజ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వం+ఇస్కాన్ సంస్ధ సంయుక్తంగా నిర్వహించిన గోపూజలో 108 గోవులకు పూజలు జరిగాయి. ఈ పూజలో పాల్గొని జగన్ గోవులకు పూజలు జరిపి హారతులిచ్చారు.

మున్సిపల్ స్టేడియంలో జగన్ పాల్గన్నప్పటికీ రాష్ట్రంలోని 2675 దేవాలయాల్లో కూడా గోపూజలు జరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు, స్ధానిక ప్రముఖులు పూజలలో పాల్గొన్నారు. మొత్తానికి పెరిగిపోతున్న మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం గోపూజ లాంటి కార్యక్రమాలను నిర్వహించటం ఎంతైన అవసరం. పూజలు చేసినంత మాత్రనా సరిపోదు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కుట్రను ఛేదించాలి.

దేవాలయాలపై దాడుల ఘటనలను పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షాలంటే ప్రతిదాన్ని రాజకీయంగా అవకాశం తీసుకునేందుకు చూస్తాయనటంలో సందేహం లేదు. అటువంటి అవకాశం ఇవ్వకపోవటంలోనే అధికారపార్టీ చాతుర్యం దాగుంది. మొన్నటికి మొన్న విజయవాడలో దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు సీఎం. కొత్త దేవాలయాలను నిర్మించటం, దాడులు జరక్కుండా చూసుకోవటమే జగన్ ముందున్న టార్గెట్లు. మరి తన టార్గెట్ రీచవ్వటంలో జగన్ సక్సెస్ అవుతారా ?