నిధిని ఇబ్బంది పెట్టడంపై దర్శకుడి వివరణ


విశాల్‌తో తీసిన పల్నాడు, జయసూర్య లాంటి సినిమాల ద్వారా తెలుగు వారికీ పరిచయమున్న తమిళ దర్శకుడు సుశీంద్రన్.. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నాడు. శింబు హీరోగా తెరకెక్కించిన కొత్త సినిమా ‘ఈశ్వరన్’ ఆడియో వేడుకలో వేదిక మీద హీరోయిన్ నిధి అగర్వాల్‌తో అతను వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నిధి మాట్లాడుతుండగా.. పక్కనే నిలబడి ‘శింబు మామా ఐ లవ్యూ’ అనాలని బలవంతం చేయడమే కాకుండా.. ఆమెకు మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా.. అలా మాట్లాడు, ఇలా మాట్లాడు అంటూ ఆమెను బలవంతం పెట్టడం, నిధి కొంచెం చిరాగ్గా హావభావాలు పెట్టడం చర్చనీయాంశమైంది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హీరోను, అతడి అభిమానులను మెప్పించేందుకు ఓ దర్శకుడు ఇంతగా దిగజారాలా అంటూ సుశీంద్రన్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. కొందరు మీడియా వ్యక్తులు సైతం ఈ వీడియో పెట్టి సుశీంద్రన్ తీరును ఖండించారు. దీంతో సుశీంద్రన్ ఈ ఉదంతంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్ నిధి అగర్వాల్‌ను పక్కన కూర్చెబెట్టుకుని అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై తన వివరణ ఇచ్చాడు. ‘ఈశ్వరన్’ సినిమాలో నిధి పాత్ర స్వభావానికి తగ్గట్లే తాను ఆడియో వేడుకలో మాట్లాడినట్లు సుశీంద్రన్ చెప్పాడు. సినిమాలో ఆ పాత్ర ‘‘మామా ఐ లవ్యూ.. మామా ఐ లవ్యూ’’ అంటూ హీరో వెంట తిరుగుతుంటుందని.. అందుకు అనుగుణంగానే తాను ఆడియో వేడుకలో నిధితో ఆ డైలాగ్ చెప్పించే ప్రయత్నం చేశానని అతనన్నాడు. అంతకుమించి తనకు వేరే ఉద్దేశాలేమీ లేవని.. ఆమెను ఇబ్బంది పెట్టాలనుకోలేదని.. ఈ వీడియో చూసి కొందరి మనసులు గాయపడ్డాయని.. అలా బాధ పడ్డ వాళ్లకు తాను క్షమాపణ చెబుతున్నానని సుశీంద్రన్ తెలిపాడు.

పక్కనే ఉన్న నిధి కూడా సుశీంద్రన్‌కు వేరే ఉద్దేశాలేమీ లేవని అతడికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో పేరు తెచ్చుకున్న నిధికి ఇదే తొలి తమిళ చిత్రం కావడం విశేషం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ‘ఈశ్వరన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.