షాకింగ్: సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్

ఇది భారత క్రికెట్ ప్రియులకే కాదు.. భారతీయులందరికీ పెద్ద షాక్. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోల్‌కతా రాకుమారుడు సౌరభ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. అతను ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అతను కోలుకుంటున్నాడని అంటున్నారు. శనివారం సాయంత్రం గంగూలీకి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉందట. ‘‘గంగూలీకి గుండె సమస్య తలెత్తింది. యాంజియోప్లాస్టీ తర్వాత అతను కొన్ని గంటల్లోనే ఆసుపత్రి నుంచి బయటికి వచ్చే అవకాశముంది’’ అని ప్రముఖ పాత్రికేయుడు బోరియా మజుందార్ పేర్కొన్నాడు. ముందుగా చాతీలో నొప్పి రావడంతో గంగూలీ ఆసుపత్రికి వెళ్లాడట. ఐతే అది గుండెపోటు అని వైద్యులు నిర్ధరించారట.

ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా కనిపించే గంగూలీకి గుండె పోటు అంటే అభిమానులకు నమ్మశక్యంగా ఉండదు. క్రికెట్ కెరీర్ ముగిశాక కూడా గంగూలీ ఏమీ ఖాళీగా లేడు. కొన్నేళ్లకే బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. గత ఏడాది అనూహ్యంగా అన్నీ కలిసొచ్చి బీసీసీఐ పీఠాన్నే అధిరోహించాడు. నిబంధనల ప్రకారం పది నెలలకే పదవి నుంచి దిగిపోవాల్సి ఉన్నప్పటికీ.. మధ్యలో సవరించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని మళ్లీ మార్చి తాను అధ్యక్షుడిగా కొనసాగేలా చూడాలని గంగూలీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. అది విచారణలో ఉండటంతో గంగూలీ పదవిలో కొనసాగుతున్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ బోర్డు ప్రపంచ స్థాయిలో బలం పుంజుకుంది. ఈ ఏడాది కరోనా వల్ల రద్దవుతుందనుకున్న ఐపీఎల్ యూఏఈలో విజయవంతంగా నిర్వహించడంలో గంగూలీది కీలక పాత్ర. ఆటగాడిగా ఉన్నపుడే కాక.. తర్వాత కూడా భారత క్రికెట్లో ఇంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తికి గుండె పోటు అనేసరికి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.