జేడీయులో ముసలం..17 మంది ఎంఎల్ఏల తిరుగుబాటు ?

బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అదికార ఎన్డీయేలోని జేడీయుకి చెందిన 17 మంది ఎంఎల్ఏలు తిరుగుబాటు బాటలో ఉన్నట్లు రాజకీయాల్లో గుప్పుమన్నాయి. ఆర్జేడీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ మాట్లాడుతూ నితీష్ కుమార్ పై తిరుగుబాటు చేయటానికి 17 మంది ఎంఎల్ఏలు సిద్దంగా ఉన్నట్లు చేసిన ప్రకటన బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

నిజంగానే 17 మంది ఎంఎల్ఏలు నితీష్ పై తిరుగుబాటు చేస్తారా ? లేదా ? అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే జేడీయు ఎంఎల్ఏలంతా నరేంద్రమోడిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే బీహార్లో మిత్రపక్షాలుగా ఉంటునే అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయుకి చెందిన ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని లాగేసుకుంది బీజేపీ. అప్పటి నుండి బీజేపీపై జేడీయూలోని ఎంఎల్ఏలు, నేతలు మండిపోతున్నారు.

ఇదే సమయంలో నితీష్ పేరుకే ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఎందుకంటే ప్రభుత్వంలో పెత్తనమంతా బీజేపీ మంత్రులు, ఎంఎల్ఏలదే అయిపోయింది. ఎలాగూ మంత్రివర్గంలో మెజారిటి బీజేపీ ఎంఎల్ఏలే ఉండటంతో నితీష్ కూడా వాళ్ళు చెప్పినట్లే వినాల్సొస్తోంది. ఈ పరిస్థితి నితీష్ కే కాకుండా ఎంఎల్ఏలు, నేతలకు కూడా బాగా సఫొకేషన్ గా ఉంటోంది. ఈ సఫొకేషన్ కాస్త తీవ్ర అసంతృప్తిగా మారిపోతోంది.

ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ఆర్జేడీ సీనియర్ నేతలు మెల్లిగా జేడీయూ ఎంఎల్ఏలతో టచ్ లోకి వెళ్ళినట్లున్నారు. అందుకనే జేడీయూలోని ఎంఎల్ఏలు కూడా ఆర్జేడీతో మంతనాలు మొదలుపెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాజక్ నితీష్ పై పెద్ద బాంబు పేల్చారు. శ్యామ్ చెప్పినట్లుగా ఇఫ్పటికిప్పుడు ఎంఎల్ఏలు రాకపోయినా ఏదోరోజు ఆ పరిస్దితి రాక తప్పదనే అనిపిస్తోంది. మొత్తానికి బీహార్ రాజకీయాలు భలే రంజుగా ఉంటున్నాయి.