రజనీకి సరైన దారి చూపిన కూతుర్లు

ఎంతైనా కూతుర్లకు తండ్రులపై ఉన్న ప్రేమే వేరు. అందుకనే కంటే కూతుర్నే కనాలి టైటిల్ తో సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా గోలమేమిటంటే ఇపుడు చెప్పుకోబోతున్నది ఓ సినిమా ఫ్యామిలి గురించి, ఓ స్టార్ హీరో కూతుర్లు గురించే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జయి చెన్నైకి వెళ్ళిన రజనీకాంత్ ఓ మూడు పేజీల లేఖను విడుదల చేశారు.

ఆ లేఖలో ఏముందయ్యా అంటే రాజకీయపార్టీ పెట్టడానికి తన ఆరోగ్యం సహకరించటం లేదు కాబట్టి తాను రాజకీయపార్టీ పెట్ట ప్రయత్నం నుండి తప్పుకుంటున్నట్లు చెప్పారు. నిజమే రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు నుండి తప్పుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన తన కొత్తపార్టీ పేరు, విధివిధానాలను ప్రకటిస్తానని ఆ మధ్య ట్విట్టర్లో ప్రకటించారు. అప్పటి నుండి కొందరికి రజనీ పొలిటికల్ ఎంట్రీపై డౌటుగానే ఉంది.

ఎందుకంటే చాలా రోజులుగా రజనీ ఆరోగ్యం బావుండటం లేదు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. పైగా వయసు కూడా 70 దాటింది. ఇటువంటి సమయంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఏమిటంటు మామూలు జనాలే ఆశ్చర్యపోయారు. అనారోగ్యం ఒకవైపు, వయస్సయిపోవటం మరోవైపు. అన్నిటికీ మించి ఎన్నికలకు మహా అయితే మరో నాలుగు నెలలే గడువుండటం. ఇదంతా చూసిన వాళ్ళకు రజనీ పొలిటికల్ ఎంట్రీ జరిగేపని కాదని అనుమానంగానే ఉంది.

ఇదే సమయంలో షూటింగ్ కోసమని హైదరాబాద్ వచ్చారు. యూనిట్లో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకిందని తేలగానే రజనీ ఆసుపత్రిలో చేరిపోయారు. టెస్టులో నెగిటివ్ వచ్చినా బీపీ మాత్రం కంట్రోలు కాలేదు. హైబీపీతోనే నాలుగు రోజులు ఆసుపత్రి ఐసీయులో ఉండి చివరకు చెన్నైకి తిరిగి వెళ్లిపోయారు. చెన్నైకి చేరుకుని ఇంటికి వెళ్లగానే కూతుర్లు ఐశ్యర్వ, సౌందర్య ఇద్దరు రజనీకి క్లాసు పీకారట.

ఈ వయస్సులో, ఇంత అనారోగ్యంతో ఉన్నపుడు మనకు కొత్త రాజకీయపార్టీ అవసరమా అని గట్టిగా తలంటిపోశారట. ప్రశాంతంగా ఉండక రాజకీయపార్టీ పెట్టి 24 గంటలు బయటే తిరిగితే ఆరోగ్యం మరింత క్షీణించటం ఖాయమని భయపడ్డారట. రాజకీయాలకన్నా ఆరోగ్యం ముఖ్యమని కర్తవ్యబోధ చేశారట. దాంతో రజనీ కూడా బుద్దిగా కూతుర్ల మాట ప్రకారమే పొలిటికల్ ఎంట్రీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వాస్తవాలను భేరీజు వేసుకుంటే రజనీకి కూతుర్లిద్దరు సరైన దారినే చూపించారని అనుకోవాలి.