ర‌ష్మిక‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్‌?

బెంగ‌ళూరు భామ ర‌ష్మిక మంద‌న్నాకు ఎక్క‌డో సుడి ఉన్న‌ట్లే ఉంది. ఇప్ప‌టికే మూడు భాష‌ల్లో న‌టిస్తున్న ఆమెకు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండ‌స్ట్రీ అయిన బాలీవుడ్లోనూ ఛాన్సులు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ద‌క్షిణాదిన ఆమె న‌టించిన సినిమాల స‌క్సెస్ రేట్ చూసో.. లేదంటే ఆ సినిమాల్లో త‌న పెర్ఫామెన్స్ చూసో లేదంటే సోష‌ల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూసో కానీ.. ఇటీవ‌లే మిష‌న్ మ‌జ్ను అనే పెద్ద ప్రాజెక్టుకు హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

సిద్దార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శాంతను బాగ్చి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. అమర్ బుటాలతో కలిసి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చిన వారం లోపే రష్మిక‌కు మ‌రో పెద్ద బాలీవుడ్ ప్రాజెక్టులో ఛాన్స్ ద‌క్కిన‌ట్లు సమాచారం బ‌య‌టికి వ‌చ్చింది.

ఈసారి ఆమె ఏకంగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు డెడ్లీ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశార‌ట‌. క్వీన్, సూప‌ర్ 30 లాంటి సినిమాల‌తో మంచి పేరు సంపాదించిన వికాస్ బ‌ల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడ‌ట‌. ఇందులో అమితాబ్ కూతురిగా ర‌ష్మిక న‌టించ‌నుంద‌ట‌. ఇందులో ఆమెకు జోడీగా న‌టించే హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకా వెల్ల‌డి కాలేదు. ఇందులో భారీ తారాగ‌ణ‌మే ఉంటుంద‌ట‌. సోష‌ల్ కాజ్ ఉన్న క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని రిల‌యెన్స్ ఎంట‌ర్టైన్మెంట్ నిర్మించ‌నుంది.

మార్చిలో డెడ్లీ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్ల‌బోతున్నార‌ట‌. బాలీవుడ్లో తొలి సినిమా గురించి ప్ర‌క‌టన వ‌చ్చిందో లేదో అప్పుడే ఇంత పెద్ద ప్రాజెక్టులో ర‌ష్మిక చోటు ద‌క్కించుకుందంటే విశేష‌మే. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులో అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న పుష్ప‌లో న‌టిస్తోంది. త‌మిళంలో కార్తి స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించిన సుల్తాన్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.