నారా రోహిత్ అలా.. శ్రీ విష్ణు ఇలా

శ్రీ విష్ణు అనే కుర్రాడికి సొంతంగా వచ్చిన గుర్తింపు కంటే.. నారా రోహిత్ ఫ్రెండుగా, అతడి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసే నటుడిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరికి ఎలా స్నేహం మొదలైందో ఏమో కానీ.. రోహిత్‌తో కలిసి వరుసగా ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, కథలో రాజకుమారి, ఆటగాళ్లు, వీర భోగ వసంతరాయలు సినిమాల్లో నటించాడు విష్ణు.

వీటిలో విష్ణు లీడ్ రోల్ చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రానికి రోహిత్ నిర్మాత కూడా. ఐతే రోహిత్ ఫామ్‌లో ఉండగా అతడి ద్వారా అవకాశాలందుకున్న శ్రీ విష్ణు.. నెమ్మదిగా హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ అతను కుదురుకునే సమయానికి రోహిత్ లైమ్ లైట్లోంచి వెళ్లిపోవడం ఆశ్చర్యం. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో విష్ణు ఒకడు. గత ఏఢాది ‘బ్రోచేవారెవరురా’తో పెద్ద హిట్ కొట్టినప్పటి నుంచి విష్ణు కెరీర్ మంచి ఊపులోకి వచ్చింది.

లాక్ డౌన్ టైంను బాగా ఉపయోగించుకున్న విష్ణు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘రాజ రాజ చోర’ అనే సినిమాను పూర్తి చేసిన శ్రీవిష్ణు.. ఈ మధ్యే అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘గాలి సంపత్’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది అంతలోనే ముగింపు దశకు వచ్చేసింది. ఇంతలో ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ లాంటి పేరున్న బేనర్లో ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమాను ఆరంభించాడు. ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా మరో సినిమా అనౌన్స్ అయింది. ప్రదీప్ వర్మ అల్లూరి అనే కొత్త దర్శకుడితో అతను జట్టు కట్టాడు.

బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఇది కూడా సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విష్ణు చేతిలో ఉన్న నాలుగు సినిమాలూ వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి. విష్ణు ఇంత ఊపులో ఉంటే.. అతడికి లైఫ్ ఇచ్చిన నారా రోహిత్ రెండేళ్లుగా ఏ సినిమా చేయలేదు. అతడి కెరీర్‌కు ఊహించని విధంగా బ్రేక్ పడింది. మళ్లీ ఎప్పుడతను సినిమా చేస్తాడో కూడా క్లారిటీ లేదు.