రాహుల్ పద్దతి మారదా ?

రాహూల్ గాంధీ పద్దతి చాలా విచిత్రంగా ఉంటోంది. రాహూల్ లో ఎక్కడ కూడా పరిణతి కనిపించటం లేదు. దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నపుడు ఆయన విదేశాలకు వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారో ? ఎందుకెళ్ళారో ? పార్టీలోని చాలామంది నేతలకు కూడా తెలీదు. రాహూల్ ఆదివారం విదేశాలకు వెళ్ళారని, ఎప్పుడొస్తారో తెలీదని పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా చెప్పారు. ఇటలీలోని మిలాన్ లో తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిఉంటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఈరోజు ఢిల్లీలో పార్టీ 138వ వ్యవస్ధాపక దినోత్సవం జరుగుతోంది. అంటే పార్టీ వ్యవస్ధాపక దినోత్సవంలో కూడ రాహూల్ పాల్గనాలని అనుకోలేదని తెలిసిపోతోంది. తొందరలోనే రాహూల్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. గతంలో అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీలోని సీనియర్ల వైఖరి నచ్చకే పార్టీ కాడిదింపేశారు. అలాంటిది సీనియర్లకు రాహూల్ కుటుంబానికి మధ్య జరిగిన ఏదో ఒప్పందం వల్ల మళ్ళీ రాహూల్ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నట్లు సమాచారం.

పార్టీ అధ్యక్షుడైనా లేకపోయినా పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ రాహూల్ ఎక్కడా కృషి చేసిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా రాహూల్ పడిన కష్టం ఏమీలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఈ యువనేత ప్రచారం చేసింది కేవలం ఎనిమిదంటే ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే. మిగిలిన వాటిలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవే ప్రచార బాధ్యతలను మోశారు. మరి మిగిలిన 62 నియోజవర్గాల్లో రాహూల్ ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికీ తెలీదు.

తాజాగా పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీకి మద్య నడుస్తున్న యుద్ధం దేశమంతా తెలుసు. ఎలాగైనా మమతాబెనర్జీని కుర్చీలో నుండి దింపేసి అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి సమయంలో రాహూల్ అసలు బెంగాల్లోకి అడుగుపెట్టిందే లేదు. రాహూల్ కూడా బెంగాల్లో పర్యటించి పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటారని నేతలు ఎదురుచూస్తుంటే ఈయనేమో ఎంచక్కా విదేశాలకు వెళ్ళిపోయారు. తమిళనాడులో కూడా ఇదే పద్దతి.

నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి దశాబ్దాలైపోయింది. పార్టీ బలోపేతంపై రాహూల్ ఏమాత్రం శ్రద్ధ చూపించని రాహూల్ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందా అన్న అనుమానం పార్టీ నేతల్లోనే పెరిగిపోతోంది. జనాల్లో కాంగ్రెస్ కు ఓట్లేయాలని ఉన్నా వేయించుకునేందుకు నేతలే సిద్దంగా లేరని అర్ధమైపోతోంది. ఈ పరిస్దితుల్లో రాహూల్ వ్యవహారశైలి ఎప్పటికైనా మారుతుందా అన్నది సందేహమే.