ఏజెంట్ గారి ఖైదీ అవ‌తారం

యువ న‌టుడు న‌వీన్ పొలిశెట్టి కెరీర్‌ను ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’కు ముందు, త‌ర్వాత అని విభ‌జించి చెప్పొచ్చు. ఆ సినిమా ముందు వ‌ర‌కు అత‌డి టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌దు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్క‌డినే లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసిన అత‌డికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు.

ఐతే యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, స్పెష‌ల్ వీడియాలతో అత‌ను ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలోనే చిచ్చోరేలో ఓ కీల‌క పాత్ర‌తో మెప్పించాడు. ర‌చ్చ గెలిచాక ఇంటికి వ‌చ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. దీని త‌ర్వాత న‌వీన్ నుంచి రాబోయే కొత్త సినిమా కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

వైజ‌యంతీ మూవీస్ లాంటి పెద్ద బేన‌ర్లో న‌వీన్ త‌న త‌ర్వాతి సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమానే.. జాతి ర‌త్నాలు. ఇందులో క‌మెడియ‌న్లు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కూడా కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఈ ముగ్గురే ఇందులో జాతిర‌త్నాలు. అందులో ఒక‌రి ప‌రిచ‌యం శ‌నివారం జ‌రిగింది. ఈ రోజు న‌వీన్ పుట్టిన రోజు సందర్భంగా అత‌ను పోషిస్తున్న జోగిపేట శ్రీకాంత్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. ఆ పాత్ర టీజ‌ర్లో న‌వీన్ ఖైదీగా క‌నిపించ‌డం విశేషం.

సెల్‌ నుంచిపోలీసుల అరాచ‌కాల‌ను ఖండిస్తూ త‌న‌దైన టైమింగ్‌తో అత‌ను చెప్పిన డైలాగ్.. జైల్లో ప‌ని చేస్తూ అత‌ను ప‌డే పాట్లు ఫ‌న్నీగా అనిపించాయి. మంచి కామెడీ ఎంట‌ర్టైన‌ర్ చూడ‌బోతున్నామ‌న్న అంచ‌నాల‌ను ఈ టీజ‌ర్ క‌లిగించింది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు టీజ‌ర్లోనే ప్ర‌క‌టించారు. అనుదీప్ కె.వి. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.