భార్య భర్తలను విడదీయబోతున్న రాజకీయాలు

రాజకీయాలు ఎంత పనైనా చేస్తాయి, చేయిస్తాయి. తండ్రీ, కొడుకులు, అన్న-తమ్ముళ్ళు ఇలా రక్త సంబంధీకులు వేర్వేరు పార్టీల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు, వేర్వేరు రాజకీయపార్టీలకు ప్రాతినిధ్యం వహించటం మనకేమీ కొత్తకాదు. కానీ పశ్చిమబెంగాల్లో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎంపి భార్య తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా భర్త నుండి విడాకులు అందుకోబోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే బెంగాల్లో టిఎంసీ-బీజేపీ మధ్య రాజకీయ వైరం ఏ స్ధాయిలో పెరిగిపోయిందో అందరు చూస్తున్నదే. వచ్చే ఏడాదిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో మళ్ళీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యట్రిక్ సాధించాలని మమతబెనర్జీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఒకపార్టీలోని ప్రజాప్రతినిధులను మరో పార్టీ లాగేసుకుంటోంది. టీఎంసికి చెందిన ఓ ఎంపి, ముగ్గురు ఎంఎల్ఏలతో పాటు పదిమంది నేతలను బీజేపీ లాగేసుకుంది. దీనికి ప్రతీకారంగానా అన్నట్లు బీజేపీ ఎంపి సుమిత్రాఖాన్ భార్య సుజాతాఖాన్ ను టీఎంసిలో చేర్చుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసే సమయంలో సుజాతాఖాన్ పార్టీ అగ్రనేతలపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. దాంతో భర్త, ఎంపి అయిన సుమిత్రాఖాన్ స్పందిస్తు తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు ప్రకటించటం సంచలనంగా మారింది.

పార్టీపట్ల విశ్వాసం ఉన్న వాళ్ళని కాదని ఇతర పార్టీల్లో నుండి వచ్చిన అవినీతిపరులకు బీజేపీ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సుజాతా ఖాన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. బీజేపీ నేతలకు ప్రత్యర్ధులపై భౌతికదాడులకు దిగటానికి కూడా వెనకాడరంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. దాంతో భర్త సుమిత్రాఖాన్ స్పందిస్తు తన భార్య వ్యాఖ్యలను కొట్టి పారేశారు.

బిష్నాపూర్ ఎంపిగానే కాకుండా బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్న సుమిత్రకు భార్య వ్యాఖ్యలు బాగా ఇబ్బందులు సృష్టించాయనటంలో సందేహం లేదు. దాంతో తన ఇబ్బందులను అధిగమించేందుకు తన భార్యకు విడాకుల నోటీసులు పంపనున్నట్లు ప్రకటించేశారు. ఎలాగు రాజకీయాల ముందు చేసిన ప్రకటన కాబట్టి కచ్చితంగానే విడాకులు తీసుకోబోతున్నట్లు అర్ధమైపోతోంది.