టీడీపీలో ఆ ఎమ్మెల్యే చాలా డిఫ‌రెంట్ గురూ!

పురుషులందు.. పుణ్య పురుషులు వేర‌యా! అన్న‌ట్టుగా ఎమ్మెల్యేల్లో తాను డిఫ‌రెంట్ ఎమ్మెల్యే అంటున్నారు టీడీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు. ప్ర‌కాశం జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన ప్ర‌తిష్టాత్మ‌కమైన ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడు, చంద్ర‌బాబు తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడించిన ఈయ‌న తిరుగు లేని నాయ‌కుడిగా దూసుకుపోతున్నారు.

వివాద ర‌హితంగా, పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డే కాకుండా.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకునే కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఇటీవ‌ల కేటాయించిన ప‌ద‌వుల్లో బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఏలూరి చోటు ద‌క్కించుకున్నారు.

నిబ‌ద్ధత‌, పార్టీ ప‌ట్ల అంకిత భావం వంటివి ఆయ‌న‌కు స్వ‌త‌హాగా వ‌చ్చిన రాజ‌కీయ భూష‌ణాలుగా ఇక్క‌డ వారు చెబుతారు. నిజ‌మే..ఎలాగంటే.. ద‌గ్గుబాటి ఇలాకాలో 2014లో విజ‌యం సాధించిన ఏలూరి.. గ‌త ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ జోరుగా ఉన్నా.. రంగంలోకి ద‌గ్గుబాటే దిగినా.. త‌న స‌త్తా చాటారు. విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత నుంచి నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సాగు నీటికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ర‌హ‌దారు ల విస్త‌ర‌ణ‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గ‌త స‌ర్కారు హ‌యాంలో శంకు స్థాప‌న చేసుకుని ఆగిపోయిన కార్య‌క్ర‌మాల‌ను కూడా కొన‌సాగిస్తున్నారు. ఏలూరి విష‌యంలో ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే.. అధికార పార్టీ నేత‌ల‌తో ఎంత వ‌ర‌కు ఉండాలో అంతే ఉంటున్నారు.

కోరి వివాదాలు తెచ్చుకోవ‌డం కానీ.. కోరి దూరం పెట్ట‌డం కానీ.. ఆయ‌న చేయ‌డం లేదు. దీంతో ప‌నుల‌న్నీ స‌క్ర‌మంగా సాగిపోతున్నాయి. ఇక‌, వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే.. వ్య‌వ‌సాయానికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు నియోజ‌క‌వ‌ర్గంలో రైతుల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. తాను ముందుంటున్నారు.అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా న‌కిలీ విత్త‌నాల బెడ‌ద నుంచి రైతుల‌ను కాపాడేందుకు తానే స్వయంగా కొన్ని సంస్థ‌ల‌తో మాట్లాడి, వాటి నాణ్య‌త‌ను ప‌రీక్షించి(గ‌తంలో వ్య‌వ‌సాయ శాఖ మండ‌లాధికారి గా ప‌నిచేసిన అనుభవం ఉంది) నేరుగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకువ‌చ్చి త‌క్కువ ధ‌ర‌ల‌కే రైతుల‌కు పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, రైతు భ‌రోసా కేంద్రాల‌ను టీడీపీ నేత‌లు వ్య‌తిరేకించ‌లేదు కానీ.. లోపాల‌ను ఎత్తిచూపారు. అయితే, ఆ లోపాల‌ను స్వ‌యంగా తానే స‌రిదిద్ది.. రైతుల‌కు చేరువ చేస్తూ.. తానో డిఫ‌రెంట్ ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏలూరి. ఏదేమైనా.. ప‌రుచూరులో ఏలూరి జ‌పం బాగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.