నిమ్మగడ్డ వాదనకు జగన్ మీడియా మద్దతిస్తోందా ?

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మార్చిలో వాయిదాపడ్డ స్ధానిక సంస్ధల ఎన్నికలను జరపాలని ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మహా పట్టుదలగా ఉన్నారు. అందుకనే ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వానికి అటు న్యాయస్ధానానికి వరుసబెట్టి లేఖలు రాస్తున్నారు.

నిమ్మగడ్డ వాదనకు, ప్రయత్నాలకు కౌంటరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా కేసులను చూపుతున్నారు. నిమ్మగడ్డ ఎన్నిసార్లు లేఖలు రాసినా కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్దితులు లేవంటు సమాధానం చెబుతోంది. ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షి వెబ్ ఎడిషన్లో ఓ వార్త వచ్చింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు.

‘గడచిన 24 గంటల్లో 44935 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 305 మందికి మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది’.. అని ఓ వార్తను ప్రచురించింది. మొత్తం 13 జిల్లాల్లో చేసిన కరోనా పరీక్షలు, నిర్ధారణైన కేసులు, యాక్టివ్ కేసులు, డిస్చార్జయిన రోగుల సంఖ్య అంటు పెద్ద టేబులే ఇచ్చింది. ఇదంతా చదివిన వాళ్ళకు ఓ అనుమానం మొదలైంది.

ఓ వైపేమో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా స్దానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే అవకాశం లేదని వాదిస్తోంది ప్రభుత్వం. కోర్టులో కూడా ఇదే వాదన వినిపించింది. మరి జగన్ సొంత పత్రిక అయిన సాక్షి మాత్రం కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో తగ్గుతోందని వార్త రాయటంలో అర్ధమేంటి ? కరోనా వైరస్ కేసుల విషయంలో ప్రభుత్వ వాదన తప్పని సాక్షి పత్రిక చెప్పదలచిందా ? ప్రభుత్వ వాదన తప్పంటే మరి నిమ్మగడ్డ ప్రయత్నానికి మద్దతుగా నిలబడుతున్నట్లే కదా ?