విపక్షంలో ఉన్న వేళ అయినా పార్టీకి రిపేర్లు చేసుకోరేం బాబు?


సమస్య అనే రోగానికి పరిష్కారమనే మందుకు మించింది మరొకటి ఉండదు. అందుకు భిన్నంగా.. ఎప్పటికప్పుడు సమస్యను డీల్ చేయకుండా దాన్ని పెండింగ్ లో ఉంచటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. సమస్యల్ని పరిష్కరించే కన్నా.. వాటిని పెండింగ్ లో పెంచేసే ధోరణి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతర్గత అంశాల్ని పట్టించుకునేంత ఓపికా.. తీరిక ఉండదు. అందుకు భిన్నంగా విపక్షంలో ఉన్న వేళలో బోలెడంత ఖాళీ దొరుకుతుంది. జిల్లాల వారీగా పార్టీని రిపేర్లు చేసుకోవటానికి అవకాశం ఉంది. కానీ.. అలాంటివి చేయకుండా సమస్యల్ని అదే పనిగా నానబెట్టే ధోరణితో పార్టీకి నష్టం వాటిల్లుతోంది. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలోని పార్టీ పరిస్థితే నిదర్శనంగా చెప్పొచ్చు.

జిల్లాలోని రామచంద్రపురం.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నేతలు లేరు. ఎన్నికల వేళ.. పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన అభ్యర్థులు సైకిల్ దిగేశారు. కండువాలు మార్చేశారు. అప్పటి నుంచి అక్కడ పార్టీని నడిపించే నేతే లేని దుస్థితి. సరైన నాయకత్వం కోసం వెతుకుతున్నట్లుగా చెబుతున్నా.. ఏడాదిన్నర నుంచి అందుకు తగ్గ నేతలు దొరకపోవటం ఏమిటన్నది అస్సలు అర్థం కాదు.

ఓపక్క స్థానిక ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్న.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని నడిపే నాయకత్వం లేకపోవటం వల్ల నష్టమే జరుగుతుంది. కానీ.. పార్టీ అధినాయకత్వం మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదన్న ఫిర్యాదు బలంగా వినిపిస్తోంది. పార్టీ బలంగా ఉండి.. క్యాడర్ ఉన్నప్పటికి వారిని నడిపించే స్థానిక నాయకత్వం లేకపోవటం చూస్తే.. ఇలాంటి లోపాల్ని చంద్రబాబు ఎందుకు అధిగమించలేరన్న సందేహం రాక మానదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముడు తోట త్రిమూర్తులు పార్టీని వదిలేశారు. అధికార పార్టీ తీర్థం తీసుకున్న ఆయన.. పక్క నియోజకవర్గమైన మండపేటకు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం సమయంలోనే సైకిల్ దిగేసిన ఆయన.. తర్వాత వచ్చి చేరారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి సైకిల్ దిగేసిన ఆయన.. తన దారిన తాను వెళ్లిపోయారు. ఇలా రెండు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేక తెలుగుతమ్ముళ్లు అల్లాడిపోతున్నారు.


ఇలాంటి ఇష్యూలను సీరియస్ గా తీసుకొని సెట్ చేస్తే సరిపోయే దానికి.. నెలల తరబడి మురగబెట్టటం ద్వారా సాధించేది ఏమీ ఉండదన్నది మర్చిపోకూడదు. ఇప్పటికైనా యువ నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఇలాంటి ఇష్యూలకు చెక్ పెట్టటంతో పాటు.. పార్టీని మరింత బలోపేతం చేసే వీలుందన్నది మర్చిపోకూడదు.